కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల సబ్స్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఎక్సైజ్ సీఐ రమేష్ ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కారు ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో సీఐ రమేష్కు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమాద సమయంలో సీఐ రమేష్ మద్యం మత్తులో కారు నడిపినట్లు తుఫాన్ వాహనంలోని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సీఐ మద్యం సేవించి వాహనం నడిపారా లేదా అనే అంశంపై కూడా విచారణ జరగాల్సి ఉంది.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతాయుతమైన అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే విషయమని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సీఐ రమేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను విధులకు దూరంగా ఉంచాలని కోరారు. పోలీసుల దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.