కొడంగల్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి 'తెలంగాణ నోయిడా'గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చి, లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని స్పష్టం చేశారు. నిన్న కొడంగల్లో పర్యటించిన సీఎం.. మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరిలతో కలిసి రూ.103 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో లగచర్లలో భూసేకరణకు కొందరు కుట్రలు చేసి రైతులను రెచ్చగొట్టారని, తమ ప్రభుత్వం భూ నిర్వాసితులతో మాట్లాడి న్యాయం చేయడంతో ఇప్పుడు లగచర్ల, హకీంపేట, పోలేపల్లిల్లో 3000-4000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. సున్నం గనులు ఇక్కడ ఉంటే, ఉద్యోగాలు కర్ణాటకకు వెళ్తున్నాయని, త్వరలోనే స్థానికంగా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.అంతకుముందు, ఎన్కేపల్లి వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ కిచెన్కు భూమి పూజ చేశారు. ఈ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 5000 మంది విద్యార్థులు అదనంగా చేరారని వివరించారు.కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల నెరవేరబోతోందని, పరిగి, కొడంగల్, నారాయణపేట మీదుగా వెళ్లే వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. రూ.5000 కోట్లతో నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు కృష్ణా జలాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa