పాతబస్తీ శాలిబండ క్లాక్ టవర్ పక్కనున్న గోమతి ఎల్రక్టానిక్ షాప్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాద సంఘటనలో ఒకరు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం మంటలకు పూర్తిగా తగలబడిపోయాయి. మంటలకు తగలబడిన కారు సీఎన్జీ వాహనం కావడంతో అందులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. గాయపడ్డ వారందరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.బాంబులు పేలిన శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అటువైపు నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తారు. మంటల ధాటికి దుకాణం షట్టర్ ఎగిరి 100 మీటర్ల దూరంలో పడిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎల్రక్టానిక్ షోరూమ్ కావడంతో అందులోని ఏసీలు రిఫ్రిజిరేటర్లు వరుసగా పెద్ద పెట్టున శబ్దాలు చేసి పేలిపోయాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
మొగల్ పురా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అటువైపు నుంచి రాకపోకలను నిలిపివేసి అగ్ని మాపక సిబ్బందికి సహకరించారు. భారీ అగ్ని ప్రమాదం కావడంతో గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూం అనుకొని ఉన్న దుకాణాల సిబ్బందితోపాటు నివాస ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ఎంత నష్టం జరిగిందనే విషయం కూడా తెలియదని సంబంధిత దుకాణాల యజమానులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa