తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక చర్యలు చేపట్టింది. ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం.. తాజాగా మహిళా సంఘాలకు ఊరటనిస్తూ రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది.
సోమవారం.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డీఆర్డీఏ అధికారులతో హైదరాబాద్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి పాల్గొన్న మంత్రి సీతక్క.. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులను నేరుగా జమ చేసినట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నాం. మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ భారం పడకుండా... ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది’ అని ఆమె వివరించారు.
గత ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు సుమారు రూ. 3,500 కోట్ల వడ్డీ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని.. దానివల్ల మహిళా సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని ఆరోపించారు. అంతేకాకుండా.. మహిళల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా గత ప్రభుత్వం వినియోగించుకుందని.. ఇది మహిళా సంక్షేమాన్ని విస్మరించడానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఏటా రూ. 25 వేల కోట్ల రుణాల లక్ష్యం..
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. నిధులను కేవలం సమీకరించడమే కాకుండా.. ఈ వడ్డీ మొత్తాలను కూడా ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ‘ఆడబిడ్డల కష్టాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు మహిళా సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఆమె ఘాటుగా విమర్శించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కనీసం రూ. 25,000 కోట్లకు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు తమ వ్యాపారాలను, కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. రుణాలను క్రమం తప్పకుండా అందిస్తూ.. మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని నింపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన ఈ రూ. 304 కోట్లు ఆ లక్ష్యం దిశగా వేసిన మరో అడుగు అని అధికారులు పేర్కొన్నారు. ఈ నిధులు గ్రామీణ మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa