ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు.. మంత్రి పొన్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:45 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారిని తన అక్కాచెల్లెళ్లతో సమానంగా చూసుకుంటానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు స్వయంగా బొట్టు పెట్టి చీర (సారే) అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


మహిళా సంఘాలకు గత పది సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలను నిరంతరంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, బస్సులు వంటి వ్యాపార అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఇక ముందు కూడా అర్హులైన వారికి వాటిని అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.


  గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మహిళా సంఘాల సభ్యులు స్వయంగా బొట్టు పెట్టి ఈ ఇందిరా మహిళా శక్తి చీరల సారె పంపిణీని చేపడుతున్నారని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఈ చీరలు పంపిణీ చేయబడతాయని మంత్రి పేర్కొన్నారు. 'మీకు ఏ కష్టం రానివ్వను. భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి సాధించి మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది' అని ఆయన మహిళలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయితీలో తాగునీటి శుద్ధి కోసం వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఒక్కో మెట్టు పూర్తి చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయానికి రూ. 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని, మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోతామని మంత్రి ప్రజలను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa