ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి పండుగ కష్టాలు షురూ.. ఆ రోజు నుంచి రిజర్వేషన్లు క్లోజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:40 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగ. ఇక ఏపీలో అయితే పండగ జోరు మామూలుగా ఉండదు. కోళ్ల పందెలు, సంక్రాంత్రి ముగ్గులు, పతంగుల పోటీలు, ముగ్గులు, ఎడ్ల పందేలు ఇలా ఘనంగా పండగను నిర్వహిస్తారు. ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడినవారు సంక్రాంతికి స్వస్థలాలకు చేరుకుంటుంటారు. హైదరాబాద్ నుంచి కూడా లక్షల మంది ఏపీలోని తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. ట్రైన్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు సాగిస్తుంటారు. సంక్రాంతి పండుగకు మరో ఏడు వారాలపైనే సమయం ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రవాణా కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కొన్ని ముఖ్యమైన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఏకంగా ఐదారొందలు దాటేసి.. టికెట్ లభించే అవకాశం లేదనే అర్థాన్ని సూచించే 'రిగ్రెట్' స్థాయికి చేరుకుంది. బస్సులు, విమానాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.


జనవరి 14వ తేదీ బుధవారం సంక్రాంతి పండుగ కావడంతో.. దానికి ముందు వచ్చే భోగి, కనుమ పండుగల కారణంగా జనవరి 9వ తేదీ శుక్రవారం నుంచి 13వ తేదీ మంగళవారం వరకు ప్రయాణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయాణాలను శుక్ర, శనివారాల నుంచే పెట్టుకోవడంతో డిమాండ్ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ప్రధాన రైళ్లయిన గోదావరి, గరీబ్‌రథ్, ఈస్ట్‌కోస్ట్, చార్మినార్, సింహపురి, గౌతమి, కోణార్క్, మహబూబ్‌నగర్-విశాఖపట్నం, శబరి, నారాయణాద్రి, పద్మావతి ఎక్స్‌ప్రెస్లలో రిజర్వేషన్లు జనవరి 9వ తేదీ నుంచే గరిష్ఠ పరిమితిని దాటి 'రిగ్రెట్'కు చేరాయి.


హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వంటి నగరాలకు జనవరి 9-13 వరకు వెయిటింగ్ లిస్టు నిండిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, చిత్తూరుకు వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 10, 11 తేదీల్లో, వెంకటాద్రిలో 10, 12 తేదీల్లో రిగ్రెట్ స్థాయి ఉంది. మహబూబాబాద్, ఖమ్మం వంటి సమీప ప్రాంతాలకు వెళ్లే వందేభారత్, గరీబ్‌రథ్ వంటి రైళ్లలోనూ రిగ్రెట్ కనిపిస్తోంది. రైళ్లలోనే కాకుండా బస్సుల్లోనూ ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉంది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే చాలా రూట్లలో సీట్లు ఇప్పటికే నిండిపోయాయి. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే కొంత మేరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు.. ప్రయాణికుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లు తమ ఛార్జీలను భారీగా పెంచడం గమనార్హం.


భారీ డిమాండ్‌ కారణంగా విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా జనవరి 10, 11 తేదీల్లో టికెట్ల ధరలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రూ.4,600 నుంచి రూ.4,900 ఉన్న విమాన ఛార్జీలు.. జనవరి 10న రూ.10,529కి, 11న రూ.8,695కి, 9న రూ.7,075కు చేరుకున్నాయి. సాధారణంగా డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు రైల్వే, ఆర్టీసీ అధికారులు వెంటనే ప్రత్యేక సర్వీసులను ప్రకటించాలి. కానీ, వెయిటింగ్ లిస్ట్ ఐదారొందలు దాటి 'రిగ్రెట్'కు చేరినా కూడా ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లు లేదా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఆన్‌లైన్‌లో ప్రకటించకపోవడం ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa