ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 07:18 PM

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా.. రకరకాల మోసపూరిత విధానాలను అనుసరిస్తూ సవాలు విసురుతున్నారు. తాజాగా.. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) గ్రూపుతో సహా పలువురు రాష్ట్ర మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను లక్ష్యంగా చేసుకుని హ్యాక్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.


ఈ సైబర్ దాడిలో కేటుగాళ్లు అనుసరించిన విధానం తెలివైనదిగా ఉంది. వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పేరును.. ఆధార్ అప్‌డేషన్ పేరును అడ్డుపెట్టుకున్నారు. మంత్రులు, జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న గ్రూపుల్లోకి ప్రవేశించి.. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తూ ప్రమాదకర ఏపీకే ఫైల్స్‌ను షేర్ చేశారు.


తొలుత ఓ జర్నలిస్టుకు సంబంధించిన ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ ఫోన్ ద్వారానే ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూపు, డిప్యూటీ సీఎం గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులు వంటి అత్యంత కీలకమైన మీడియా సంబంధిత వాట్సాప్ గ్రూపులను ప్రభావితం చేశారు. ఈ ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేసిన వెంటనే.. వినియోగదారుల ఫోన్‌లోని నియంత్రణ వ్యవస్థను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఆ ఫోన్ ద్వారానే గ్రూపుల్లో ఎస్‌బీఐ ఆధార్ లింకు పేరుతో ఆ ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి. అయితే.. ఈ హ్యాకింగ్ వార్త వైరల్ అయిన వెంటనే సీఎంవో గ్రూపు అడ్మిన్‌లు స్పందిస్తూ.. ‘సీఎంవో గ్రూపు సురక్షితం’ అని సమాచారం అందించారు.


రాష్ట్ర పరిపాలనలో కీలకమైన సమాచార మార్పిడి జరిగే గ్రూపులను లక్ష్యం చేసుకోవడం వెనుక.. కేవలం డబ్బు దండుకోవడమే కాకుండా.. ప్రభుత్వ సమాచారాన్ని సేకరించడం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి దురుద్దేశాలు కూడా ఉండే అవకాశం ఉందని సైబర్ నిపుణులు అనుమానిస్తున్నారు.


వాట్సాప్ గ్రూపుల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపిన నేపథ్యంలో.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హ్యాకైన వాట్సాప్ గ్రూపులను సురక్షితంగా ఉంచారు. కేవలం ఎనిమిది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆర్డర్ కాపీలను డౌన్‌లోడ్ చేస్తుండగా గేమింగ్ సైట్‌లోకి దారి మళ్లించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.


సైబర్ నిపుణులు ఈ సందర్భంగా ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టులకు, అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ఏపీకే ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దు. అపరిచితుల నుంచి లేదా అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఆధార్/కేవైసీ అప్‌డేట్ కోసం ఏపీకే ఫైల్స్‌ను వాట్సాప్‌లో పంపవని గుర్తించాలి. వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి ఫోన్లలో సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa