ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పెన్నుల మీద మన్ను గప్పితే గన్నులై మొలకెత్తుతాయి’.. సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 08:38 PM

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట, పాటతో ప్రజల్లో అద్భుతమైన చైతన్యం నింపిన కవి అందెశ్రీ సంస్మరణ సభ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై, అందెశ్రీ సేవలను కొనియాడారు. ఆయనతో పాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఆచార్య కోదండరాం వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం పై తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు కానీ.. అమాయకులు మాత్రం కాదని అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఏ ఒక్కరూ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని, నిరంకుశ పాలనను సహించరని స్పష్టం చేశారు.


తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని.. చారిత్రకమైనదని సీఎం కొనియాడారు. గద్దరన్న, గూడ అంజన్న, అందెశ్రీ, గోరెటి వెంకన్న వంటి కవులు నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ తమ ఆట, పాటలతో ప్రజల్లో ఉద్వేగాన్ని నింపారని గుర్తుచేశారు. "వాళ్లు తీసుకొచ్చిన ఊపుతోనే తెలంగాణ కల సాకారమైంది" అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.


 "పెన్నుల మీద మన్ను కప్పితే, అవి గన్నులై మొలకెత్తుతాయి; మీ గడీలను కుప్పకూలుస్తాయి" అన్న అందెశ్రీ నినాదాన్ని ఆయన ఉటంకించారు. ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన 'జయజయహే తెలంగాణ' గీతాన్ని రాష్ట్రానికి అందించారని, అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదని తెలిపారు. తెలంగాణ సాకారమైన తర్వాత.. అందెశ్రీ వంటి కీలక వ్యక్తులను కనుమరుగు చేసే ప్రయత్నం జరిగిందని.. ఆ పాట పదేళ్లుగా మూగబోయి ఉండవచ్చని.. కానీ ప్రజల గుండెల్లో నిత్యం నిలిచిందని సీఎం పరోక్షంగా గత ప్రభుత్వాన్ని విమర్శించారు.


తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు కోరుకున్న 'జయజయహే తెలంగాణ' గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని.. ప్రతి పాఠ్య పుస్తకంలో చేర్చామని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు కళ్ల లాంటి వారైన అందెశ్రీ, గద్దరన్న వంటి వారి కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర సేవ చేసిన అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని ప్రకటించారు. కవులు, కళాకారులు, దళితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ చర్చ వచ్చినా, అందెశ్రీ పేరు 'కోహినూరు వజ్రంలా' చర్చకు వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa