ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిపీఎం నేత గొంతు కోసి చంపిన దుండగులు,,,ఖమ్మంలో దారుణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:18 PM

తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తున్న రాజకీయ నేత దారుణ హత్యకు గురి కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దుండుగులు ఆయన మీద దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలో ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ దారుణం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..


ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావును అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశారు దుండగులు. స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. ఈ హత్య జరగడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు..స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు.


ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సామినేని రామారావును దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆయన శుక్రవారం ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా ఇంట్లోకి చొరబడిన దుండుగులు.. ఆయనపై దాడి చేసి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.


స్థానికంగా అందరితో కలిసిపోయి.. వారి మంచి చెడులు తెలుసుకునే రామారావుకు ఇక్కడ మంచి పేరు ఉంది. అదికాక త్వరలోనే నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపగలరని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.


దారుణం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


ఈ ఘటనపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఇలాంటి హత్యా రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదు" అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రామారావు కుటుంబానికి అండగా నిలబడతామని, కేసును త్వరగా ఛేదించి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa