ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టుల దగ్గర 400 కేజీల బంగారం.. అదంతా ఎవరికి చెందుతుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:04 PM

ఆపరేషన్ కగార్ వల్ల ముఖ్య మావోయిస్టు నేతల నుంచి సాధారణ దళ సబ్యుల వరకు చాలా మంది లొంగి పోతున్నారు. ప్రస్తుతం దేశంలో మావోయిస్టుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో అనేక ప్రశ్నలు, అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఇన్నాళ్లు మావోయిస్టులు సేకరించిన కోట్ల రూపాయల నగదు , ఆస్తులు ఎక్కడ.. ఎవరి ఆధీనంలో ఉన్నాయి.. డంపుల మాటేమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు మరో ఆసక్తికర వార్త తెగ ప్రచారం అవుతోంది. అది ఏంటంటే.. మావోయిస్టులు సేకరించిన వందల కోట్ల రూపాయల నగదును కరోనా సమయంలో బంగారం రూపంలోకి మార్చారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మావోల వద్ద దాదాపు 400 కేజీల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇదంతా ఎక్కడ ఉంది.. ఎలా భద్రపరిచారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


గతంలో మావోలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి భారీ స్థాయిలోపార్టీ ఫండ్‌ వసూలు చేశారు. ఆ మొత్తాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. అలానే మావోయిస్టు పార్టీకి నిధుల సేకరించేందుకు గాను పెద్ద స్థాయిలో నెట్ వర్క్ ఉందన్న విషయం జాతీయ విచారణ సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తులో వెలుగు చూసింది. ఇప్పుడు మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసినా సరే వారి వద్ద ఉన్న నిధులతో మరో ఐదారు సంవత్సరాలు పార్టీని నడపొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ అప్పటి వరకు మావోలు బతికి ఉండే అవకాశం లేక.. వరుసగా లొంగిపోతున్నారు.


 మావోయిస్టులు తమకు అందిన డబ్బును రెండు రకాలుగా మార్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ప్రధానంగా పార్టీ సానుభూతిపరులు,వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరటి బ్యాంక్ అకౌంట్స్ తెరిచి వాటిల్లో డిపాజిట్ చేయడంతో పాటు.. కొందరి పేరు మీద కంపెనీలు.. మరి కొన్ని సార్లు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు జమ చేశారని తెలుస్తోంది. మిగిలిన నగదును బంగారం రూపంలోకి మార్చేశారని అధికారులు భావిస్తున్నారు.


ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దగ్గర.. దాదాపు రూ.400 కోట్ల నిధులు ఉంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలానే 400 కేజీల బంగారం నిల్వలు కూడా ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ బంగారం అంతా అడవుల్లోని డంపుల్లో ఉందా.. లేదంటే బయట ఎక్కడైనా దాచారా అనే అనే అంశంపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాలో భారీ ఎత్తున నగదు డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అలానే లొంగిపోతున్న మావోయిస్టుల తమ దగ్గర ఉన్న ఆయుధాల గురించే కాక నగదు గురించి కూడా లెక్కలు చెప్పాకే బయటకు వస్తున్నారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa