ఇటీవలి ‘మొంథా’ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు, రహదారులు, ఇళ్లు, విద్యుత్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో పంట నష్టం, ఆస్తి నష్టం, రహదారి దెబ్బతిన్న వివరాలను సేకరించి కలెక్టర్లు కేంద్రానికి నివేదికలు పంపేలా సూచించారు. రాష్ట్రం ఎదుర్కొన్న ఈ విపత్తును కేంద్రానికి సమగ్రంగా వివరించి సహాయ నిధులు తీసుకురావడం లక్ష్యమని సీఎం తెలిపారు.
ప్రజల నష్టానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. రాష్ట్రం ధనికమైనదే కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ సాయం పథకం ప్రకారం చర్యలు ప్రారంభించింది. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఇళ్లు మునిగిపోయిన బాధిత కుటుంబాలకు రూ.15వేల చొప్పున సాయం, గుడిసెలు ధ్వంసమైన వారికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కొత్త ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. ఆవులు, గేదెలు మరణించిన సందర్భంలో రూ.50వేలు.. మేకలు, గొర్రెలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం సూచనలతో అధికార యంత్రాంగం అన్ని జిల్లాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేసింది. విద్యుత్, తాగునీటి సదుపాయాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆయన హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, శాఖల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ నెలకు సంబంధించి మొత్తం రూ.1,031 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలకు రూ.712 కోట్లు, పంచాయతీ రాజ్ అండ్ ఆర్ అండ్ బీ శాఖల్లో 46,956 బిల్లులకు సంబంధించిన నిధులు ఉన్నాయి. ఈ నిధుల విడుదలతో అనేక అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.
పంచాయతీ రాజ్ శాఖలో గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతాయి. ఆర్ అండ్ బీ శాఖలో రహదారి మరమ్మతులు, వంతెనల నిర్మాణం వంటి పనులకు ఊతం లభిస్తుంది. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఖజానా స్థితిని పరిశీలించి ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa