బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మొంథా తుపాను తీరం దాటిందని.. కాకినాడకు సమీపంలోని నరసాపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం తీవ్ర తుపాను బలహీనపడిందని.. రానున్న కొన్ని గంటల్లో అది తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
భద్రాచలానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో.. ఖమ్మంకు 110 కిలోమీటర్ల దూరంలో ఈ మొంథా తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా రానున్న కొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా తీవ్ర హెచ్చరికలు చేసింది.
ఇక బుధవారం రోజున వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్.. 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, సూర్యాపేట, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు.. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. గురువారం రోజున ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
ఇక ఇప్పటికే మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై గట్టిగా ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పర్వతగిరిలో ఏకంగా 34.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. వరి ధాన్యం కోసి మార్కెట్ యార్డులకు తరలించగా.. భారీ వర్షాలకు తడిసి ముద్దైనట్లు రైతులు వాపోతున్నారు. ఇంకా పొలాల్లో కోయని వరి పంట అలాగే ఉందని అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa