ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణపై మొంథా పంజా: 6 జిల్లాలకు రెడ్ అలర్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 08:24 PM

మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షం కురిస్తోంది. గడిచిన ఆరు గంటలుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో రికార్డుస్థాయిలో 34.8 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. సిద్ధిపేట జిల్లాను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుఫాను ఖమ్మం జిల్లాకు తూర్పుగా 110 కి.మీ., ఒడిశాలోని మల్కాన్‌గిరికి దక్షిణ నైరుతి దిశగా 130 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కి.మీ.వేగంతో వెళ్తోన్న వాయుగుండం.. ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమేపి బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.


హన్మకొండ, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెబర్తిలో 17.4, దూల్మిట్టిలో 15.9, చేర్యాలలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. యాదాద్రి, హన్మకొండ, ములుగు, సిద్ధిపేట, జనగాం, మహబూబ్‌బాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఈ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం హన్మకొండ, ములుగు, సిద్ధిపేట జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. హన్మకొండ, ములుగు జిల్లాలకు మరో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.


ఇదిలా ఉండగా, రైల్వే ట్రాక్‌పై వరద నీరు భారీగా చేరడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు వెనక్కి పంపారు. తిరిగి వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు పంపినట్టు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్; ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు రంగంలోకి దిగారు. వరంగల్ నగరం ప్రస్తుతం వరద ముంపు ముంగిట ఉంది. ఇక, భారీ వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. వరి పంట చేతికొచ్చే సమయంలో తుఫాను వారిని దెబ్బతీసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa