ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడికి తప్పిన ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:14 PM

రైలు ప్రయాణాల విషయంలో జాగ్రత్త ఎంత ముఖ్యమో మరోసారి ఈ ఘటన ద్వారా రుజువైంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనలో.. ఒక ప్రయాణికుడు అతి కష్టం మీద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతోంది.


కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నం..


వరంగల్‌కు చెందిన మణిదీప్ అనే యువకుడు ఈ నెల 26న బెంగళూరు వెళ్లేందుకు రైలు ఎక్కాడు. ఈ క్రమంలో జరిగిన పొరపాటు అతని జీవితంలోనే అతి పెద్ద ప్రమాదానికి దారితీసింది. అనుకోకుండా తాను వెళ్లాల్సిన బోగీకి బదులుగా వేరే బోగీలోకి ఎక్కాడు. రైలు కదలడం మొదలయ్యాక.. తన పొరపాటును గుర్తించిన మణిదీప్.. వెంటనే కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో అతను బ్యాలెన్స్ కోల్పోయి.. రైలు చక్రాల కింద పడబోయాడు. ప్లాట్‌ఫామ్ అంచున వేలాడుతున్న అతడి పరిస్థితిని చూసి అక్కడున్న వారంతా భయాందోళన చెందారు.


మణిదీప్ ఈ ప్రాణాపాయ పరిస్థితిని సమయస్ఫూర్తితో గుర్తించిన తోటి ప్రయాణికులు.. డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా... అతడిని బలంగా పక్కకు లాగారు. వెంటనే అక్కడున్న వారు స్పందించడంతో మణిదీప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు . కదులుతున్న రైలు ఎక్కడం లేదా దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.


  భారతీయ రైల్వేలు ఈ విషయంలో పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా.. కొందరు ప్రయాణికులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. రైలు ఆగే వరకు కూడా కొందరు ఓపిక పట్టలేక.. ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. తొందర్లో దిగి పోవాలి అనే ఆత్రుత ఎంతటి నష్టానికి గురిచేస్తోంది ఈ సంఘటన గుర్తుచేస్తోంది. రైల్వే అధికారులు ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి అవగాహన కల్పించల్సిన అవరం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa