ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరుగురికి ప్రాణం పోసిన రమ్యశ్రీ,,,బ్రెయిన్‌డెడ్ అయిన గృహిణి అవయవ దానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 04:37 PM

మానవత్వం, దాతృత్వం మూర్తీభవించిన అద్భుత ఘట్టం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కేవలం 28 ఏళ్ల చిన్న వయసులోనే బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించబడిన ఓ గృహిణి.. అవయవ దానం ద్వారా ఏకంగా ఆరుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలకు కొత్త వెలుగును ప్రసాదించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన బండిగారి రమ్యశ్రీ అనే గృహిణి ఈ అరుదైన దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.


రమ్యశ్రీ ఈ నెల 21వ తేదీన తన ఇంట్లో ఉన్న సమయంలోనే హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యులు అన్ని రకాల చికిత్సలు అందించినప్పటికీ.. రమ్యశ్రీ కోలుకోలేకపోయారు. చివరికి, ఆమె బ్రెయిన్‌డెడ్‌ (జీవన్మృతురాలు) అయినట్లు వైద్యులు నిర్ధారించారు.


ఈ హృదయవిదారక విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ వైద్య బృందం రమ్యశ్రీ భర్త రాజలింగం, వారి కుటుంబ సభ్యులను సంప్రదించింది. వారు విషాదంలో ఉన్నప్పటికీ, అవయవదానం యొక్క ప్రాముఖ్యత, అది ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టగల అద్భుత అవకాశం గురించి జీవన్‌దాన్‌ బృందం సున్నితంగా వారికి వివరించింది. రమ్యశ్రీ చనిపోతూ కూడా ఎంతో మందికి ప్రాణదాతగా నిలవాలనే గొప్ప ఉద్దేశంతో ఆమె భర్త రాజలింగం, కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. వారి ఆమోదంతో జీవన్‌దాన్‌ బృందం అవయవాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది.


రమ్యశ్రీ నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, ఒక ఊపిరితిత్తిని విజయవంతంగా సేకరించారు. ఆ తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవాల కోసం నిరీక్షిస్తున్న ఆరుగురు రోగులకు శస్త్రచికిత్సల ద్వారా ఈ అవయవాలను అమర్చారు. అంతేకాకుండా ఆమె రెండు కంటి కార్నియాలను కూడా సేకరించి, చూపులేని వారికి అమర్చి వారికి దృష్టిని ప్రసాదించారు. ఇలా రమ్యశ్రీ తాను ఆరిపోతూ.. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. రమ్యశ్రీ దాతృత్వం ఎందరికో ఆదర్శనీయం. ఆమె ప్రాణాలను కోల్పోయినప్పటికీ తన అవయవాల రూపంలో ఆరుగురిలో జీవించి ఉందని జీవన్‌దాన్‌ నోడల్‌ అధికారి ప్రొ. శ్రీభూషణ్‌రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రమ్యశ్రీ త్యాగం గొప్పతనాన్ని, అవయవదానం ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa