ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లీకూతుళ్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బస్సు మిస్ అయినా ఛేజింగ్ చేసి ఎక్కిన యువకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 05:55 PM

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేము అన్న పాత మాట ఎంత నిజమో అని నిరూపిస్తూ.. విధి ఆడిన వింత నాటకానికి నిదర్శనంగా నిలిచింది కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం. దీపావళి పండుగ సందడి ముగిసిన.. మరికొన్ని గంటల్లోనే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకున్న పందొమ్మిది మందికి పైగా ప్రయాణికుల జీవితాలు అగ్ని ప్రమాదానికి బలైపోయాయి.


గమనాలు వేరైనా.. గమ్యస్థానం ఒక్కటే...


దురదృష్టకర రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆ బస్సులో ఉన్న ప్రతి ఒక్కరిదీ ఒక కథ. కొందరు పండుగ సెలవులు ముగించుకుని ఉద్యోగాలకు తిరిగి వెళ్తున్నవారు.. మరికొందరు తమ భవిష్యత్తు కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న యువత.. వీరందరి ప్రయాణ లక్ష్యాలు వేరు కావొచ్చు, కానీ వారి తుది గమ్యం మాత్రం ఆ మృత్యువు ఒడిలోనే దాగి ఉందని ఎవ్వరూ ఊహించలేదు.


మెదక్ జిల్లా శివ్వాయిపల్లికి చెందిన మంగ సంధ్యారాణి (43) , ఆమె కుమార్తె మంగ చందన (23)ల కథ కన్నీళ్లు తెప్పిస్తోంది. సంధ్యారాణి భర్త మంగ ఆనందకుమార్ గౌడ్ మస్కట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండేవారు. కుమార్తె చందన బెంగళూరులో.. కుమారుడు వల్లభ అలహాబాద్‌లోని ఐఐటీలో చదువుతున్నారు. బంధువుల పెళ్లి, దీపావళి వేడుకల కోసం ఈ కుటుంబమంతా ఒక్కటయ్యారు. పండుగ ముగిశాక ఆనంద్‌కుమార్ మస్కట్‌కు వెళ్లిపోయారు.


జ్వరం కారణంగా సంధ్యారాణి ప్రయాణం వాయిదా పడింది. తల్లిని చూసుకోవడానికి చందన కూడా హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. సంధ్యారాణికి జ్వరం తగ్గగానే.. కుమార్తెను బెంగళూరులో దించి, అక్కడి నుంచి తను మస్కట్‌కు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ.. ఆ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వారి ప్రయాణాన్ని శాశ్వతంగా నిలిపివేసింది. నిండు జీవితాలు, నిద్రలోనే సజీవ దహనం అయ్యాయి. ఒకే కుటుంబంలో, ఒకే ఘటనలో తల్లీకూతుళ్లు కనుమరుగవడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది.


మురిసిపోయిన సాఫ్ట్‌వేర్ అమ్మాయిలు..


యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనూష రెడ్డి, బాపట్ల జిల్లాకు చెందిన ధాత్రి అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీపావళికి ఇంటికి వచ్చి, సంతోషంగా గడిపి, తిరిగి పని ప్రదేశాలకు వెళ్తూ ఇలా కలకాలం సెలవు తీసుకుంటారని వారి తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు.


ఉజ్వల భవిత కోసం పరుగు..


బీటెక్ విద్యార్థి జయసూర్య (23) కథ మరో కోణాన్ని చూపింది. ఉద్యోగం కోసం గంపెడాశలతో బెంగళూరులో ఇంటర్వ్యూకు వెళ్తున్న జయసూర్య.. తాను బుక్ చేసుకున్న బస్సు మిస్సవ్వడంతో.. ఛేజింగ్ చేసి మరీ మూసాపేట్‌లో బస్సు ఎక్కాడు. ఎట్టకేలకు బస్సు అయితే ఎక్కాడు.. కానీ ప్రమాదం అతని వెంటనే ఉందని గమనించలేకపోయాడు. అయితే ఆ ప్రమాదం నుంచి అతడు ఎమెర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడి.. తన ప్రాణం పోకుండా కాపాడుకున్నాడు.


నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు..


ఈ తీవ్ర విషాదం వెనుక, ట్రావెల్ బస్సుల నిర్వహణలో ఉన్న లోపాలు చర్చకు వచ్చాయి. ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో రూ. 23 వేల వరకు ఓవర్‌స్పీడ్ చలాన్లు ఉన్నట్లు వెల్లడైంది. నిబంధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో ప్రయాణించడం, ఒడిశా పర్మిట్‌తో మూడు రాష్ట్రాల్లో బస్సును నడపడం వంటి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఈ నిండు జీవితాలు బలయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ తిరిగి రానివి ఆ అమాయక ప్రాణాలు. విధి రాసిన రాతను ఎవరూ మార్చలేము. నిండు జీవితాలు ఆ మృత్యు జ్వాలల్లో కలిసిపోవడం ప్రతి మనిషి గుండెను కదిలించే కన్నీటి గాథ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa