తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, ప్రభుత్వ పాఠశాలల్లో 1-10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రక్త పరీక్షలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులతో పాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో రేడియో ప్రసారాలు చేయాలని, ప్రతి నెలా గ్రోత్ ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకోవాలని యోచిస్తోంది. 'మిషన్-100 డేస్' పేరుతో ప్రచారం నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉత్తర్ ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల కంటే తెలంగాణలోని కౌమార దశ పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదని, బాలికల్లో రక్తహీనత సమస్య ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, యూఆర్ఎస్లు, గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్లలో ఉన్న సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేయనున్నారు.
పిల్లలకు రక్త పరీక్షలు చేసిన తరువాత, వారికి అవసరమైన ఆహారాన్ని అందిస్తారు. దాని వల్ల ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రతి నెలా గ్రోత్ ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుంటారు. ఆ తరువాత విద్యార్థుల వయసును బట్టి, వారికి ఉన్న సమస్యకు తగిన పోషకాలతో కూడిన ఆహారం ఇస్తారు. తల్లిదండ్రులకు కూడా పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం గురించి అవగాహన కల్పిస్తారు. రక్త పరీక్షలతో పాటుగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో కంటిచూపు, వినికిడి లోపాలు ఉన్నాయేమో టెస్ట్ చేస్తారు. వయసు ప్రకారం పిల్లలు మాట్లాడగలుగుతున్నారో లేదో కూడా గమనిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 7 నెలల నుంచి 6 ఏళ్ల వయసులోపు పిల్లలు 19 లక్షల మందికి పైగా ఉన్నారు. గర్భిణులు, బాలింతలు సుమారు 3.55 లక్షల మంది ఉన్నారు. పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, వినికిడి సమస్యలు, కంటిచూపు లోపాలు, మాటలకు సంబంధించిన సమస్యలను 5 ఏళ్లలోపు గుర్తిస్తే, చికిత్స అందించి పరిష్కరించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
అంగన్వాడీల్లోని పిల్లలను ఎప్పుడూ గమనించేలా సి.సీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని వెంటనే తగ్గించలేం కాబట్టి, ఏడాదికి 5 శాతం తగ్గించాలని నిర్ణయించారు. దీని ప్రకారం పిల్లలతో పాటు బాలింతలు, గర్భిణులకు అందించే ఆహారంలో మార్పులు చేస్తారు. ముఖ్యంగా మిల్లెట్లతో (తృణధాన్యాలతో) కూడిన ఆహారాన్ని అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa