ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 04:54 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తోందని ప్రతిపక్షాలు.. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్ల పెంపు విషయంలో ప్రభుత్వం తీరుపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల మహాగర్జన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేస్తోందని ఆరోపించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా దివ్యాంగుల పింఛన్‌ను నెలకు రూ.4,000 నుంచి రూ.6,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే.. వృద్ధాప్య, వితంతు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫిలారియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ రోగులు, బోధకాలు బాధితులు వంటి ఇతర లబ్ధిదారులకు ప్రస్తుతం నెలకు రూ.2,000 పింఛన్‌ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం ఏర్పడి ఏడదిన్నర దాటినా ఇప్పటివరకు ఈ పెంపు అమలు కాలేదు.


మందకృష్ణమాదిగ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీ మేరకు పింఛన్‌ను పెంచి ఇస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ఇది దివ్యాంగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. పింఛన్ల పెంపు సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో మహాగర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా కండరాల క్షీణత కలిగిని వారకిి కూడా రూ.15 వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో వీహెచ్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు.


పింఛన్ల పెంపుపై ప్రభుత్వం వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం భారీ ఆర్థిక భారం అని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. అప్పు ఎక్కడా ముట్టడం లేదు అని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆసరా పింఛన్ల పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా వేల కోట్లు కేటాయిస్తున్నారు. హామీ ఇచ్చిన విధంగా పింఛన్లను పెంచితే, రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రజలు మాత్రం ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బులు తమ జీవనాధారమని, ధరలు పెరిగిన ఈ రోజుల్లో పాత పింఛన్ సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ హామీని ఎప్పుడు నెరవేరుస్తుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa