ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ చేరికల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిని కేటీఆర్ గుర్తుచేశారు. "హైదరాబాద్కు ఐటీ కంపెనీలను తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కృషి మరువలేనిది. ఆయన లాంటి నాయకులు భవిష్యత్తులో మరింత మంది రావాలి." అంటూ కేటీఆర్ ఆకాంక్షించారు.
అదే సమయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మంచి పనులు చేశారని కేటీఆర్ కొనియాడారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల ఆనవాళ్లు లేకుండా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
"ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. రైతులు, మహిళలు, యువతను మోసం చేస్తూ పాలన సాగిస్తోంది." అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా.. చంద్రబాబుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాగా.. చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులే కాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. "నా మిత్రుడు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారిస్తూ ఆయన కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా." అంటూ ట్వీట్ చేశారు మోదీ.
మరోవైపు.. చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నటుడు చిరంజీవి సైతం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విషెస్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa