ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాడి రైతులకు భారీ ఊరట..విజయ పాల ధరలు పెంచే యోచనలో సర్కార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 05:51 PM

తెలంగాణ రైతులకు వరుసగా శుభవార్తలు చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో గుడ్ న్యూస్ చెప్పే యోచనలో ఉంది. ఇప్పటికే రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఎకరానికి రూ.12 వేల రైతుభరోసా కూడా ఇస్తోంది. ఇప్పటివరకు సాగు రైతులకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించిన సర్కార్.. ఇప్పుడు పాడి రైతును కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. విజయ డెయిరీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పాల ధరలను సవరించాలని నిర్ణయించింది. ఒక్కో లీటరు పాలపై రూ.3 వరకు పెంచాలని భావిస్తోంది.


అయితే.. సర్కారు ఇప్పటికే మూడుసార్లు పాల ధరలను సవరించింది. కాగా.. ప్రస్తుతం మార్కెట్‌లో లీటరు ఆవు పాల ధర ఇతర ప్రైవేట్, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీ దాదాపు రూ.8 నుంచి రూ.9 ఎక్కువగా చెల్లిస్తోంది. అయితే.. రైతులను మరింత ప్రోత్సహించాలన్న ఆలోచనతో.. ఆవు పాలు లీటరుపై గరిష్ఠంగా 3 రూపాలయ వరకు పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో.. లీటరు ఆవు పాల ధర రూ.42.24, గేదె పాల ధర కూడా రూ.51.00 ఉండేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనలు.. ప్రభుత్వం వద్దకు చేరగా.. త్వరలోనే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ.. ధరలు పెంచితే పాడి రైతులకు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది.


అయితే.. తెలంగాణకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరకే పాలు దిగుమతవుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ డెయిరీలు, కోఆపరేటివ్‌ రంగంలోని డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి లీటర్‌కు రూ.27 నుంచి రూ.32 చొప్పున ఆవు పాలను సేకరించి, మార్కెటింగ్‌ కమీషన్లను పెంచి అమ్మకాలను పెంచుకుంటున్నాయి. దీంతో.. ఆ ప్రభావం విజయ డెయిరీ పాలపై పడుతోంది.


ఇప్పటికే ప్రైవేట్ డెయిరీల ప్రభావం విజయ డెయిరీపై పడుతుండగా.. దీంతో పాటు విజయ పేరుతో కొన్ని ఫేక్ డెయిరీలు అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నట్టు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం విజయ డెయిరీ పాలు రోజుకు 2.8 లక్షల లీటర్లు అమ్ముడు పోతుండగా.. అమ్మకాలు మరింత పెంచే దిశగా సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పాడి రైతులందరికీ బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయటంతో పాటు.. వారిని మరింత ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు సమాచారం.


ఈ క్రమంలోనే.. తాజాగా విజయ డెయిరీ యంత్రాంగం సమావేశమై 3 ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. సుమారు రూ.50 కోట్ల పాత బకాయిలు చెల్లించాలని సర్కారును కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రతి నెలా 5 నుంచి 20వ తేదీ మధ్య పాల బిల్లులు చెల్లించేందుకు విజయ డెయిరీ ఏర్పాట్లు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa