|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:56 PM
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' దాడితో ఇరాన్ పాలన కుప్పకూలుతుందని డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా.. సుప్రీం లీడర్ ఖమేనీ వంటి అగ్రనేతలు మరణించినా.. ఇరాన్ ఇంకా దీటుగా ఎదురుదాడి చేస్తూనే ఉంది. క్షిపణి దాడులు, డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యాన్ని వణికిస్తోంది. ఇరాన్ ఇంతటి మొండితనాన్ని ప్రదర్శించడానికి కారణం.. దశాబ్దాల క్రితమే ఆ దేశం సిద్ధం చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యూహం. అమెరికాకు ఏమాత్రం మింగడుపడని ఈ వ్యూహాన్ని తీసుకొచ్చింది మహ్మద్ అలీ జఫారీ. అతడెవరు, ఈ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అసలెవరీ మహ్మద్ అలీ జఫారీ?
మెజాయిక్ డిఫెన్స్ వ్యూహానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ మేజర్ జనరల్ మహ్మద్ అలీ జఫారీయే. 2007 నుంచి 2019 వరకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్-ఇన్-చీఫ్గా పని చేసిన జఫారీ.. ఇరాన్ సైనిక సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చివేశారు. ముఖ్యంగా ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న అనుభవంతో.. అగ్రరాజ్యాల సైనిక బలహీనతలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 2003లో అమెరికా చేతిలో సద్దాం హుస్సేన్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోవడాన్ని చూసిన జఫారీ.. కేంద్రీకృత అధికారం ఉంటే ప్రమాదమని గ్రహించారు. అందుకే నాయకత్వం లేకపోయినా పని చేసే వికేంద్రీకృత రక్షణ వ్యవస్థకు రూపకల్పన చేశారు.
సాధారణంగా ఏదైనా దేశంపై దాడి జరిగినప్పుడు ఆ దేశ ప్రధాన నాయకత్వాన్ని దెబ్బతీస్తే సైన్యం చెల్లాచెదురు అవుతుంది. కానీ జఫారీ రూపొందించిన మొజాయిక్ డిఫెన్స్లో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇరాన్ తన సైన్యాన్ని మొత్తంగా 31 ప్రావిన్షియల్ కమాండ్లుగా విభజించింది. ప్రతి విభాగం ఒక స్వతంత్ర సైన్యంలా పని చేస్తుంది. ఒకవేళ రాజధానితో సంబంధాలు తెగిపోయినా, పైన ఉన్న లీడర్లు మరణించినా.. ఆయా ప్రాంతాల్లోని స్థానిక కమాండర్లు తమ వద్ద ఉన్న ఆయుధాలు, నిఘా వ్యవస్థతో సొంతంగా యుద్ధం చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. కేవలం ఇరాన్ లోపలే కాకుండా బయట ఉన్న హెజ్బుల్లా వంటి స్లీపర్ సెల్స్ కూడా ఈ వ్యూహంలో భాగమే.
అమెరికాకు మింగుడుపడడం లేదు?
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ.. "మా రాజధానిపై బాంబులు వేసినా మా యుద్ధ సామర్థ్యం తగ్గదు. యుద్ధం ఎప్పుడు, ఎలా ముగియాలో మేమే నిర్ణయిస్తాం." అని చెప్పారు. జఫారీ రూపొందించిన ఈ వ్యవస్థ వల్ల ఇరాన్ను లొంగదీసుకోవాలంటే అగ్రరాజ్యాలు ప్రతి అంగుళంపై పోరాడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఇది సుదీర్ఘకాలం పాటు సాగే యుద్ధం కావడంతో.. శత్రువు ఆర్థికంగా, సైనికంగా అలసిపోయేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు.