|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:54 PM
పశ్చిమాసియాలో యుద్ధం 15వ రోజుకు చేరుకున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన ఒక వీడియో అంతర్జాతీయంగా పెను చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన కుడి చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగానే నెతన్యాహు వీడియోనా లేక ఏఐతో సృష్టించినదా, అసలు నెతన్యాహు క్షేమంగానే ఉన్నారా? అనే చర్చ మొదలైంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
వివాదానికి కారణమైన ఆరో వేలు..
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల గురించి వివరిస్తూ నెతన్యాహు మార్చి 13వ తేదీన ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను కాస్త పరిశీలించి చూస్తే.. నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో ఏఐతో సృష్టించిందని.. అందుకే ఆరు వేలు ఉన్నట్లు కనిపిస్తోందంటూ నెటిజెన్లు పోస్టులు పెట్టారు. ఇలా ఈ వీడియో కాస్తా వైరల్గా మారింది. ముఖ్యంగా అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్ క్యాండేస్ ఓవెన్స్ సైతం దీనిపై స్పందిస్తూ.. "బిబీ (నెతన్యాహు మారుపేరు) ఎక్కడ? ఆయన కార్యాలయం ఎందుకు ఇలాంటి ఏఐ వీడియోలను రిలీజ్ చేసి డిలీట్ చేస్తోంది?" అని ప్రశ్నించారు. దీంతో ఈ వార్త మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
క్లారిటీ ఇచ్చిన గ్రోక్..!
ఈ పుకార్ల నేపథ్యంలో ఎక్క్కు చెందిన ఏఐ చాట్బాట్ 'గ్రోక్' ఈ వీడియో వెనుక అసలు వాస్తవాలను వెల్లడించింది. నెతన్యాహుకు అందరిలాగే ఐదు వేళ్లే ఉన్నాయ.., అది కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమేనని స్పష్టం చేసింది. పోడియం వద్ద ఆయన చేయి పెట్టిన తీరు, అక్కడున్న లైటింగ్, కెమెరా యాంగిల్ వల్ల ఆరో వేలు ఉన్నట్లు తప్పుగా కనిపిస్తోందని తేల్చిచెప్పింది. అలాగే నెతన్యాహు మరణించారంటూ వస్తున్న వార్తలను కూడా అది కొట్టిపారేసింది. ఇలాటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఓవైపు వీడియో వివాదం సాగుతుండగానే.. నెతన్యాహు కుమారుడు యైర్ నెతన్యాహు సోషల్ మీడియాలో సైలెంట్ అవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా చాలా యాక్టివ్గా ఉండే యైర్.. మార్చి 9వ తేదీ తర్వాత ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. అలాగే ఇజ్రాయెల్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి హఠాత్తుగా వెళ్లిపోవడం కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా నెతన్యాహు చివరి సారిగా బీట్ షెమెష్ ప్రాంతంలోని శిథిలాల మధ్య నడుస్తూ కనిపించారని కొన్ని నివేదికలు స్పష్టం చేయగా.. ఆయన మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా గ్రోక్ క్లారిటీ ఇవ్వడంతో.. ఈ పుకార్లకు చెక్ పడింది.
Latest News