|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:37 PM
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం భారతీయ వంట గదుల్లో మంటలు పుట్టిస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణలతో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా.. సామాన్యుల భయం ఇప్పుడు బ్లాక్ మార్కెట్ వ్యాపారులకు వరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడటంతో.. అక్రమ విక్రయదారులు సిలిండర్ ధరను ఆకాశానికి తీసుకెళ్లారు. ముఖ్యంగా బ్లాక్ మార్కెట్లో ఒక్క ఎల్పీజీ సిలిండర్ ధర రూ.6,500 కాగా రీఫిల్ చేయడానికి రూ.4000 తీసుకుంటున్నారు.
ఒక్క సిలిండర్ వెయ్యి నుంచి రూ.6500కు!
వంటగ్యాస్ అక్రమ దందాను బట్టబయలు చేసేందుకు ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధానికి ముందు రూ. 900 నుంచి రూ. 1,000 మధ్య ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో ఏకంగా రూ. 6,500 కు చేరింది. కేవలం రీఫిల్ కోసమే రూ. 3,500 నుంచి రూ. 4,000 వరకు వసూలు చేస్తున్నారు. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో స్మార్ట్ ఫోన్ రిపేర్ షాపులు, కిరాణా స్టోర్ల వెనుక గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారం సాగుతోంది. మేము చేయాల్సిన పనులల్లా చేస్తాం.. కానీ ఎవరికీ దొరకమంటూ ఓ అక్రమ వ్యాపారి కెమెరా ముందే ధీమా వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతతకు అద్దం పడుతోంది.
రాజస్థాన్లోని విద్యా కేంద్రమైన కోటాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సుమారు 600 నుంచి 700 సిలిండర్ల అవసరం ఉన్న హాస్టళ్లు, మెస్ నిర్వాహకులు.. విద్యార్థులకు భోజనం పెట్టలేక చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చినా.. ఇంకా అమలు కాకపోవడంతో చేసేదేమీ లేక బ్లాక్ మార్కెట్లో సిలిండర్కు రూ. 3,500 పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది?
గ్యాస్ కొరతపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పందించారు. దేశంలో తగినంత చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. సాధారణంగా రోజుకు 55 లక్షల బుకింగ్లు జరిగేవని. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 88 లక్షలకు చేరిందని గుర్తు చేశారు. ప్రజలు భయంతో ముందే బుక్ చేసుకోవడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని ఆమె తెలిపారు. 29 రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ పంపిణీ ప్రారంభమైందని.. అక్రమ నిల్వలు చేసే వారిపై దాడులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు.
భారత్ తన ఎల్పీజీ అవసరాలలో 60 శాతాన్ని దిగుమతుల ద్వారానే పొందుతుంది. అందులో 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయబడంతో ఈ సంక్షోభం తలెత్తింది. వినియోగదారులు అధికారిక ఛానెళ్ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని, బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
Latest News