|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:33 PM
తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే), బీజేపీల మధ్య పొత్తులపై వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. టీవీకే అధ్యక్షుడు విజయ్కు ఉప-ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. విజయ్ ఎన్డీయేలో చేరికపై చర్చలు తుది అంకానికి చేరుకున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, టీవీకేకు 80 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు వెల్లడించాయి. డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేశామని, కానీ విజయ్ మాత్రం సీఎం పదవిపై దృష్టి పెట్టారని.. చర్చల్లో ఇది కీలకంగా మారిందని చెప్పాయి.
కానీ, ఈ విషయంపై ఇప్పటివరకు అటు బీజేపీ, ఇటు టీవీకే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే, బీజేపీ, డీఎంకేలకు తాము సమాన దూరంలో ఉంటామని, ఎవరితోనూ పొత్తులు ఉండవని విజయ్ ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయినాసరే, దీనిపై ప్రచారం జరుగుతూనే ఉండటం గమనార్హం.
తమిళనాడులో ఇళయ దళపతి , నటుడు విజయ్కు ఉన్న భారీ అభిమానులే టీవీకే పట్ల బీజేపీ ఆసక్తికి ప్రధాన కారణం. వీరు ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అనేక నియోజకవర్గాల్లో కనీసం రెండు శాతం ఓట్లను ప్రభావితం చేయగలరు. దీంతో విజయ్తో సంప్రదింపులకు కాషాయ పార్టీ అనేక మార్గాలను అన్వేషించినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా టీవీకేను తమ కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ఆఫర్ రాజకీయంగా ముఖ్యమైంది అయినప్పటికీ, విజయ్ను సలహాదారులు మాత్రం వద్దని వారిస్తున్నారు. కూటమిలో చేరడం వల్ల రాజకీయ ప్రత్యామ్నాయంగా స్థాపించిన టీవీకే విశ్వసనీయత దెబ్బతింటుందని భావిస్తున్నారు. జాతీయ పార్టీతో జతకట్టడం వల్ల విజయ్, టీవీకే అంచనా వేసిన స్వతంత్ర ఇమేజ్ తగ్గిపోతుందనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ విచారణకు విజయ్ ఢిల్లీ వెళ్లడంతో ఆయన బీజేపీ నేతలను కలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ, వీటిని టీవీకే తోసిపుచ్చింది.