|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 06:22 PM
8
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. త్యాగరాజు వీధిలో బైక్ నుంచి వెలువడిన విషపూరిత పొగ పీల్చి తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మెకానిక్ ఇచ్చిన అనాలోచిత సలహా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మురళి అనే వ్యక్తి శనివారం తన బైక్ చెడిపోవటంతో మెకానిక్ షాపుకు తీసుకెళ్లాడు. ఇంజిన్ బోర్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంజిన్ సెట్ అవ్వాలంటే రాత్రంతా బైక్ను ఆన్ చేసి ఉంచాలని మెకానిక్ సూచించాడు.
దీంతో మురళి తన బైక్ను ఇంటి లోపల ఉంచి.. తలుపులన్నీ వేసి ఇంజిన్ ఆన్ చేశాడు. మురళి, రేవతి దంపతులు పైన గదిలో పడుకోగా.. కింద గదిలో తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన నిద్రించారు. గాలి ఆడే అవకాశం లేని ఆ ఇరుకు గదిలో రాత్రంతా వెలువడిన పొగ దట్టంగా పేరుకుపోయింది. ఉదయం చూసేసరికి నలుగురూ విగతజీవులుగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
సాధారణంగా వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్ (CO) అనే ప్రమాదకరమైన వాయువు ఉంటుంది. దీనికి రంగు, రుచి, వాసన ఉండవని నిపుణలు చెబుతున్నారు. మూసి ఉన్న గదుల్లో ఇంజిన్ ఆన్ చేసినప్పుడు.. ఈ వాయువు గాలిలోని ఆక్సిజన్ స్థానాన్ని ఆక్రమిస్తుందని.. మనం పీల్చే గాలి ద్వారా ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసిపోతుందని చెబుతున్నారు. దీనివల్ల మెదడుకు, గుండెకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుందని గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ వాయువు ప్రభావం వల్ల మనిషికి ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియదని అంటున్నారు. స్పృహ కోల్పోయి నిద్రలోనే ప్రాణాలు పోతాయిని చెబుతున్నారు. పుంగనూరు పట్టణంలోనూ ఇదే జరిగి ఉంటుందని అంటున్నారు.
బైక్ లేదా కారు ఇంజిన్ను ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో స్టార్ట్ చేయకూడదని సూచిస్తున్నారు. కనీసం కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలని అంటున్నారు. ఇంజిన్ బోర్ చేసినప్పుడు వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్లో ఉంచాల్సిన అవసరం లేదని. ఒకవేళ ఉంచినా అది బహిరంగ ప్రదేశంలో మాత్రమే ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్లలో గాలి, వెలుతురు వచ్చేలా వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని.. జనరేటర్లు, పంపు సెట్లను కూడా ఇళ్ల లోపల వాడకూడదని అంటున్నారు.
Latest News