|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 06:15 PM
కాణిపాకం వినాయకుడి ఆలయంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఆలయానికి ముందువైపు ఉన్న కోనేరు పూడ్చివేయాలని కాణిపాకం ఆలయం పాలకమండలి నిర్ణయించింది. ఆలయంలో కొత్త పుష్కరిణి నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయానికి ముందువైపు పుష్కరిణి ఉంది. మూడువైపులా మాడవీధులు ఉన్నాయి. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు ఈ మాడవీధుల గుండా విహరిస్తూ ఉంటారు. మాడవీధులు విశాలంగా ఉన్నప్పటికీ.. ముందున్న పుష్కరిణి కారణంగా అప్పుడప్పుడూ వాహన సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పుష్కరిణి నిర్మించాలని కాణిపాకం పాలకమండలి నిర్ణయించింది.
ప్రస్తుతం ఉన్న కోనేరు పూడ్చివేసి, సమీపంలోనే మరో కొత్త కోనేరు నిర్మించనున్నారు. సుపథ మండపానికి 60 అడుగుల దూరంలో రూ.3.40 కోట్లతో కొత్త పుష్కరిణి నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అక్కడ ఉన్న భవనాలను తొలగించాలని పాలకమండలి నిర్ణయించింది. పాలకమండలి తీసుకున్న నిర్ణయాలకు ఏపీ దేవాదాయ శాఖ నుంచి అనుమతి కూడా లభించింది. దీంతో కాణిపాకం ఆలయంలో కొత్త కోనేరు నిర్మాణం కోసం ఆలయ అధికారులు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. వీలైనంత వేగంగా పుష్కరిణి నిర్మాణ పనులు పూర్తి చేసి.. ఈ ఏడాది స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి కొత్త కోనేరు అందుబాటులోకి తేవాలని పాలకమండలి పట్టుదలగా ఉంది.
మరోవైపు కాణిపాకం ఆలయంలో నిర్మించే కొత్త పుష్కరిణిని కూడా పాత కోనేరు సైజులోనే నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న కోనేరు 140 అడుగుల పొడవు, అంతే వెడల్పుతో 12 అడుగుల లోతు ఉంటుంది. కొత్త కోనేటిని కూడా ఇదే కొలతలతో నిర్మించనున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న కోనేటిలోని రాళ్లనే కొత్త పుష్కరిణి నిర్మాణంలో ఉపయోగిస్తారు. అలాగే మరిన్ని ఆధునిక హంగులు కల్పిస్తారు.
పుష్కరిణి చుట్టూ రాతి స్తంభాలు, కోనేటి మధ్యలో రాతి నీరాజన మండపం, వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు. భక్తులు కోనేటిలోకి దిగేందుకు వీలుగా బారీకేడ్లు, ద్వారాలు ఏర్పాటుచేయనున్నారు. నీటిని పరిశుద్ధంగా ఉంచేలా మెషీన్లు, కోనేటి చుట్టూ ఎలక్ట్రిక్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా కోనేటి నిర్మాణాన్ని బ్రహ్మోత్సవాల సమయానికి పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Latest News