|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:58 PM
భారతదేశంలోని ప్రముఖ డెయిరీ సంస్థల్లో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి. ఇది పాలు, పెరుగు, నెయ్యి, జున్ను సహా ఇతర పాల ఉత్పత్తుల తయారీతో పాటు విక్రయిస్తుంటుంది. 1992లోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిని స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఏ పదవిలోనూ లేరు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ కంపెనీకి వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. హైదరాబాద్ సమీపంలో ఉన్న శామీర్ పేటలో ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. కొంత కాలంగా ఐస్క్రీమ్, ఇతర వాల్యూ యాడెడ్ డెయిరీ ప్రొడక్ట్స్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ పేర్కొంది.
>> ఈ కొత్త హెరిటేజ్ ఐస్క్రీమ్ ప్లాంటులో సంవత్సరానికి 2.4 కోట్ల లీటర్లకుపైగా ఐస్క్రీమ్ ఉత్పత్తి చేయొచ్చని.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఐస్క్రీమ్ విభాగంతో హెరిటేజ్ ఫుడ్స్ రూ. 100 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. రానున్న 7-8 ఏళ్లలో ఐస్క్రీమ్ వ్యాపారాన్ని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 5 రెట్ల వరకు పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ భారతదేశమంతటా విస్తరిస్తున్న పంపిణీ వ్యవస్థకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్పర్సన్ ఎం. భువనేశ్వరి తెలిపారు. ఎక్కువ నాణ్యత ఉన్న, వినూత్న ఐస్క్రీంలను ఆవిష్కరించేందుకు ఇది తోడ్పడుతుందని ఆమె చెప్పారు. ఈ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సహా సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
షేర్ ధర భారీ పతనం..
కొత్త ఐస్క్రీమ్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన వచ్చినప్పటికీ.. హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర ఇటీవల భారీగా పతనం అవుతోంది. శుక్రవారం సెషన్లో (మార్చి 13) కూడా ఇంట్రాడేలో ఒక దశలో 5 శాతానికిపైగా పతనంతో రూ. 300.05 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 4.50 శాతం నష్టంతో రూ. 307.60 వద్ద సెషన్ ముగించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.85 వేల కోట్లుగా ఉంది. నెల వ్యవధిలో ఈ స్టాక్ ధర 12 శాతానికిపైగా పతనమైంది. 6 నెలల్లో 37 శాతం పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే 32 శాతం తగ్గింది. ఏడాది వ్యవధిలో 20 శాతం దిగొచ్చింది. ఇటీవల క్యూ3 ఫలితాల్లో అంచనాల్ని అందుకోకపోవడంతో అక్కడి నుంచి స్టాక్ ధర వరుసగా దిగొస్తూనే ఉంది. ప్రస్తుత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కూడా ఈ స్టాక్పై ప్రభావం చూపిస్తోంది.