|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:57 PM
మిడిల్ ఈస్ట్లో ఇంకా టెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు నిర్వహిస్తుంటే.. ఇదే సమయంలో ఇరాన్ సమీప గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై భీకర దాడులు చేస్తుంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. చమురు సరఫరాలో కీలక మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధి వద్ద చమురు నౌకల్ని ఇరాన్ కదలనీయట్లేదు. దీంతో పలు దేశాల్లో తీవ్రంగా ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. దీంతో క్రూడ్ ధరలు కూడా భీకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్లో వంట గ్యాస్ ధరల్ని పెంచగా.. ఇప్పుడిప్పుడే కొరత తీవ్రత పెరిగిపోతోంది. క్రూడాయిల్ ధర రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు బ్యారెల్కు 100 డాలర్ల మార్కు దాటింది.
>> ఇదే సమయంలో చమురు సరఫరాకు అడ్డంకుల నేపథ్యంలో.. ధరల్ని నియంత్రించేందుకు అమెరికా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందన్న కారణంతో గతంలో రష్యా చమురు విక్రయాలపై అమెరికా, యూరప్ వంటి దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా చమురుపై ఆంక్షల్ని అమెరికా సడలించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న లేదా లోడ్ అయిన రష్యా చమురు నౌకల నుంచి ఆయిల్ కొనుగోలు చేసేందుకు భారత్ సహా పలు దేశాలకు అనుమతించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
భారత్, చైనా నుంచి రష్యా చమురుకు గిరాకీ..
భారత్కు కూడా ఇందులో భాగంగానే రష్యా చమురు కొనుగోలుకు 30 రోజుల పాటు మినహాయింపు కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీంతో భారత్, చైనా సహా పలు దేశాల నుంచి రష్యా చమురుకు గిరాకీ పెరిగింది. అమెరికా ప్రకటన నేపథ్యంలో రష్యా దీనిపై తాజాగా స్పందించింది. ప్రపంచ ఇంధన మార్కెట్కు రష్యా చమురు ఎంత కీలకమో ఇప్పుడు అమెరికా చేసిన ప్రకటన ద్వారా తెలుస్తుందని పేర్కొంది. తమ చమురు లేకుండా అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉండవని తెలిపింది.
యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడం.. రష్యాకు ఎక్కువగా అనుకూలిస్తుందని.. ఈ ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంలో రష్యానే అసలైన విజేత అని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఇటీవల వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే మాట నిజమవుతోంది. ఇతర దేశాల చమురును ఇరాన్ అడ్డుకోవడం సహా ఇదే సమయంలో భగ్గుమంటున్న చమురు ధరల కారణంగా.. పుతిన్ ప్రభుత్వానికి బిలియన్ డాలర్లలో అదనపు ఆదాయం సమకూరుతుందని అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
యూఎస్ సెనేటర్ ఆంగస్ కింగ్ దీని గురించి మాట్లాడారు. 'ఈ పశ్చిమాసియా యుద్ధంలో నిజమైన విజేత రష్యా, పుతిన్దే. ఈ యుద్ధమే మాస్కోకు ఊహించని స్థాయిలో లాభాల్ని తెచ్చిపెడుతోంది. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి రష్యా సుమారు 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 55 వేల కోట్లు) అదనపు ఆదాయం పొందింది. ఇది రోజువారీగా చూస్తే అదనంగా దాదాపు 400 మిలియన్ డాలర్ల వరకు (భారత కరెన్సీలో రూ. 3700 కోట్లకుపైనే) ఆదాయాన్ని ఆర్జించింది.' అని అంచనాల్ని ప్రస్తావించారు.
Latest News