|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 08:52 PM
ఇరాన్ అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు ధర మరింత పెరుగుతుందనే ఆందోళనతో గృహ వినియోగదారులు గ్యాస్ను కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు. అసలు, గ్యాస్ దొరుకుతుందా లేదా అనే భయాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంటగ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. వంటగ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయవద్దని సూచించింది. దేశంలో గృహ అవసరాలకు తగిన వంటగ్యాస్ అందుబాటులో ఉందని వెల్లడించింది. ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతశర్మ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత లేకుండా ఉండేందుకు ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 30 శాతం పెంచినట్లు తెలిపారు.చమురుశుద్ధి కర్మాగారాలలో తగినంత ముడిచమురు నిల్వలు ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని అన్నారు. గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశంలో, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని ఆందోళన అవసరం లేదని కేంద్రం రెండు రోజుల క్రితం కూడా ప్రకటించింది.
Latest News