|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 07:26 PM
పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇరాన్ అణు సామర్థ్యానికి వెన్నెముకగా ఉన్న అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలను తమ దాడుల్లో మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అధికారికంగా ప్రకటించారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక, అణు వ్యవస్థలపై ఇజ్రాయెల్ సాధించిన ఘనత గురించి వివరించారు.
అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలు హతం..
ఇరాన్ అణు బాంబు తయారీ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ వ్యూహాత్మక దాడులను నిర్వహించాయి. అయితే ఈ దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమం వెనుక ఉన్న అత్యంత కీలకమైన శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారని నెతన్యాహు వెల్లడించారు. ఇది ఇరాన్ అణు కలలపై కోలుకోలేని దెబ్బ అని, వారి సాంకేతిక నైపుణ్యం ఇప్పుడు చిన్నాభిన్నమైందని ఆయన పేర్కొన్నారు.
ఇదే వేదికపై నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మోజ్తాబా ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోజ్తాబా కేవలం రివల్యూషనరీ గార్డ్స్ చేతిలో ఒక కీలుబొమ్మ అని, ఆయన బహిరంగంగా ప్రజల ముందుకు కూడా రాలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇరాన్ పాలన ఇప్పుడు మత గురువుల చేతుల్లో లేదని, అది పూర్తిగా సైన్యం కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. అలాగే ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోతోందా అన్న ప్రశ్నకు నెతన్యాహు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "ఆ ఉగ్రవాద సంస్థ (ఇరాన్ ప్రభుత్వం) లోని ఏ ఒక్క నాయకుడి ప్రాణానికి కూడా నేను భరోసా ఇవ్వలేను. వారికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా జారీ చేయలేము" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇరాన్ ప్రజలకు నెతన్యాహు పిలుపు
యుద్ధం ఇరాన్ ప్రజలపై కాదని, వారిని అణచివేస్తున్న పాలకుల పైనేనని నెతన్యాహు స్పష్టం చేశారు. "ఇరాన్ ప్రజలారా.. మీ దేశం ఒక కొత్త స్వేచ్ఛా పథం వైపు పయనించే సమయం ఆసన్నమైంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది. కానీ అంతిమంగా మార్పు అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆ నిర్ణయం మీరే తీసుకోవాలి" అంటూ ఆయన ఇరాన్ ప్రజలకు నేరుగా సందేశాన్ని పంపారు. ఇదిలా ఉండగా.. అణు శాస్త్రవేత్తల మృతిపై ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందోనని అంతర్జాతీయ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
Latest News