|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 07:25 PM
అమెరికాలో స్థిరపడిన ఇద్దరు భారత సంతతి సోదరుల అక్రమ సామ్రాజ్యం కుప్పకూలింది. దశాబ్ద కాలంగా వీసా మోసాలు, వైద్య బీమా అక్రమాలు, మనీలాండరింగ్, పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న 60 ఏళ్ల భాస్కర్ సవాని, 58 ఏళ్ల అరుణ్ సవానిలను అమెరికా కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరు చేసిన నేరాల తీవ్రత దృష్ట్యా భాస్కర్కు 420 ఏళ్లు, అరుణ్కు 415 ఏళ్ల గరిష్ట జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.
'సవాని గ్రూప్' పేరుతో పెద్ద ఎత్తున మోసాలు..
వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన భాస్కర్ సవాని.. తన సోదరుడు అరుణ్తో కలిసి సవాని గ్రూప్ పేరుతో ఒక భారీ నెట్వర్క్ను సృష్టించారు. దీని ద్వారానే వీరు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా భారత్ నుంచి కార్మికులను రప్పించేందుకు తప్పుడు వీసా దరఖాస్తులు సమర్పించేవారు. తీరా వారు అమెరికా వచ్చాక.. వారి వేతనాల్లో కొంత భాగాన్ని తిరిగి సంస్థకు కట్టాలని వేధించేవారు. ఇమ్మిగ్రేషన్ హోదా కోసం ఆ కార్మికులు వీరి వద్ద బానిసలుగా బతకాల్సిన పరిస్థితి కల్పించారు.
అలాగే అర్హత లేని డెంటల్ క్లినిక్ల ద్వారా సుమారు 30 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 250 కోట్లు) తప్పుడు మెడికల్ క్లెయిమ్స్ చేశారు. ఒక వైద్యుడు విదేశాల్లో ఉన్న సమయంలో.. ఆయన నంబర్ను వాడుకుని చికిత్స చేసినట్లు బిల్లులు కూడా సృష్టించడం చూస్తుంటే.. వీరు ఏ స్థాయిలో నేరాలకు పాల్పడ్డారో అర్థం అవుతుంది. అంతేకాకుండా "మనుషులకు వాడకూడదు" అని స్పష్టంగా ఉన్న ప్రోటోటైప్ దంత పరికరాలను.. రోగుల అనుమతి లేకుండా వారి నోటిలో అమర్చారు. ఎఫ్డీఏ అనుమతి లేని ఈ పరికరాలు వాడటం వల్ల రోగుల ప్రాణాలు ముప్పులో పడ్డాయి.
ఇవి మాత్రమే కాకుండా సుమారు 1.6 మిలియన్ డాలర్ల వ్యక్తిగత ఆదాయంపై వీరు పన్నులు చెల్లించలేదు. తమ పిల్లల కాలేజీ ఫీజులు, ఇంటి మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్లను బిజినెస్ ఖర్చులుగా చూపి అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ అక్రమ సంపాదనను కప్పిపుచ్చుకోవడానికి డజన్ల కొద్దీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారు. అయితే 2023లో వీరిపై ఆరోపణలు రాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈక్రమంలోనే వీరి బాగోతాలన్నీ బయటపడ్డాయి. కోర్టులో విచారణ కూడా జరిగింది.
శిక్ష ఎప్పుడు?
భాస్కర్ సవానికి జులై 8వ తేదీన, అరుణ్ సవానికి జులై 9వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు. అమెరికా చట్టాల ప్రకారం ఫెడరల్ క్రైమ్స్లో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. కాబట్టి అన్ని నేరాలకు గాను వీరిద్దరికీ 400 ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే వీరు తమ శేష జీవితం మొత్తాన్ని జైల్లోనే గడపాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే కాకుండా వీరి అనుచరురాలు అలెగ్జాండ్రాకు కూడా ఈ కేసుల్లో 40 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Latest News