|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 05:16 PM
ఏపీలో సంచలనం రేపిన ఓఎల్ఎక్స్ మోసాల కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు ఏలూరు జిల్లాకు చెందిన అజిత్కుమార్ రూ.50 విలువ చేసే ఒక్కో సిమ్ను ఏకంగా రూ.1500 కొనుగోలు చేసి నేరాలకు పాల్పడేవాడు. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఓఎల్ఎక్స్, గ్రానైట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. భారీగా సిమ్లను కొనుగోలు చేసిన అజిత్ కుమార్.. ఒక్కో సిమ్ను ఒక్కో నేరానికి ఉపయోగించేవాడు.. ఆ తర్వాత పక్కన పడేస్తాడు. ఒకసారి సిమ్ను వాడాడంటే.. మరోసారి ఆ సిమ్ ఉపయోగించేవాడు కాదు.
అజిత్ కుమార్పై ఆంధ్ర, తెలంగాణతో పాటుగా తమిళనాడు, కర్ణాటకలో మోసాలకు పాల్పడ్డాడు. అతడిపై ఏకంగా 32 కేసులు ఉన్నాయి.. మోసం చేసిన ప్రతిసారి కొత్త సిమ్ ఉపయోగించేవాడు. అజిత్కుమార్ క్యాబ్లో ప్రయాణిస్తూ.. డ్రైవర్తో మాటలు కలిపేవాడు. డబ్బులు ఇస్తానని ఆశపెట్టి సిమ్, బ్యాంకు అకౌంట్ తీసుకునేవాడు. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి నుంచి కూడా కొనుగోలు చేశాడు. అజిత్కుమార్ ఒక్కో విడతలో 30 నుంచి 40 చొప్పున సిమ్లు తీసుకునేవాడు. రూ.50 విలువైన సిమ్ను.. రూ.1,500 ఇచ్చి మరీ కొనుగోలు చేసేవాడు.. ఇలా మోసాలకు పాల్పడ్డాడు.
అజిత్కుమార్పై ఒక్క ఓఎల్ఎక్స్కు సంబంధించి 12 కేసులు నమోదయ్యాయి. మిగిలినవి గ్రానైట్ వ్యాపారం పేరుతో చేసిన మోసాలకు సంబంధించినవి. అజిత్కుమార్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీసాయి గ్రానైట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పేరుతో వ్యాపారం ప్రారంభిచానని చెప్పాడు. గ్రానైట్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి సరుకు తీసుకునేవాడు.. కానీ ఆ తర్వాత డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టేవాడు. కొంతమంది దగ్గర గ్రానైట్ పంపిస్తానని చెప్పి అడ్వాన్సులు తీసుకుని మోసం చేసేవాడు. అక్కడ చాలామందిని మోసం చేసి తిరిగి ఏలూరు జిల్లాలోని సొంత ఊరికి వెళ్లాడు. అతడిపై ప్రకాశం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఓఎల్ఎక్స్ మోసాలకు పాల్పడ్డాడు. ఇలా మోసాలు చేసి సంపాదించిన డబ్బులతో లగ్జరీ లైఫ్ గడిపేవాడు. ఈ డబ్బుల్ని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, క్యాసినోలకు ఖర్చు చేశాడు.
అజిత్కుమార్ కార్ల డీలర్గా నటిస్తూ OLX ప్లాట్ఫారమ్లో కార్ల కొనుగోలు–అమ్మకాల పేరుతో మోసం చేశాడు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు తీసుకుని బంగారం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో నగదుగా మార్చుకునేవాడు. పోలీసులు నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో కొనుగోలు/అమ్మకాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులతో డబ్బు లావాదేవీలు చేయకూడదని పోలీసులు సూచించారు.