|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 05:11 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు గైర్హాజరైనట్లు తెలిసింది. వివిధ కారణాలతో మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు దూరంగా ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆరుగురు మంత్రులు కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. జనసేన ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో బిజీగా ఉన్న కారణంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినెట్ భేటీకి రాలేకపోయారు. మరోవైపు అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత, టీజీ భరత్ సమాచారం అందించారు. భార్య సంవత్సీరకం కారణంగా మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్ హాజరుకాలేకపోయారు.
మరోవైపు మార్చి14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లా కేంద్రాలు, మండలాలు, నగరాలు, పంచాయతీలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో ఘనంగా నిర్వహించాలని తొలుత జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
అయితే ఎండలు. వేడిగాలుల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని.. జిల్లాలు, మండలాలు, పంచాయతీల వారీగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగరవేయనున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించనున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు.
సభ్యత్వ నమోదు పొడిగింపు
మరోవైపు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం గడువు మార్చి పదో తేదీతో ముగియగా.. మార్చి 17 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మార్చి 10 వరకు చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే సభ్యత్వ నమోదు గడువు పెంచాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తులు, పార్టీ ఎమ్మెల్యేల కోరిక మేరకు మార్చి 17 వరకూ పొడిగిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
Latest News