|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 07:22 PM
పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ ప్రభావం భారత్పై కూడా పడింది. వాణిజ్య అవసరాలకు సిలిండర్లపై ప్రభుత్వం పరిమితులు విధించింది. ఈ క్రమంలో దేశంలో గ్యాస్ కొరత లేదని, రోజుకు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. దేశీయ అవసరాల కోసం దాదాపు 60 శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నామని, ఇందులో సుమారు 90 శాతం హర్మూజ్ జల సంధి ద్వారా భారత్కు రవాణా అవుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. క్లిష్ట పరిస్థితి ఉన్నా కానీ, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయడానికే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆమె చెప్పారు. వాణిజ్య అవసరాలకు సిలిండర్లపై పరిమితులు విధించడంతో ఆతిథ్య రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్లు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే మెనులో వంటకాలను రెస్టారెంట్లు తగ్గించాయి.
‘‘రోజువారీ 50 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నాం.. డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు ఉన్నాయి.. కానీ, గ్యాస్ కొరత ఏర్పడుతుందేమోననే భయాందోళనతో బుకింగ్లు ఎక్కువ రెట్లు పెరిగాయి.. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మేము కోరుతున్నాం... లబ్ధిదారుల జాబితాను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాం.. తద్వారా సిలిండర్, వాణిజ్య సిలిండర్ డెలివరీ ప్రాధాన్యతా ప్రాతిపదికన జరుగుతుంది’’ అని ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
‘‘దేశీయ మార్కెట్లో గ్యాస్ సరఫరా డిమాండ్, సప్లయ్ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అన్ని రంగాలలోనూ చర్యలు తీసుకుంటోంది. సరఫరా విషయానికొస్తే మేము ప్రయత్నాలు చేస్తున్నాం.. మా దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాం.. అదే సమయంలో దిగుమతులపై కూడా దృష్టిపెట్టాం.. పట్టణాల్లో బుకింగ్ వ్యవధి 21 నుంచి 25 రోజులకు పెరిగింది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి సరఫరా కొరత లేదు’’ అని సుజాత శర్మ అన్నారు.
‘‘ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వివరాణత్మక చర్చ జరిగింది..చమురు మార్కెటింగ్ కంపెనీలు కొన్ని వాణిజ్య సిలిండర్లను, 19 కిలోల సిలిండర్లను కూడా విడుదల చేయాలని నిర్ణయించాయి. కానీ పంపిణీ పారదర్శకంగా, ప్రాధాన్యతా పద్ధతిలో జరిగేలా చూసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంతం పాత్ర చాలా ముఖ్యమైంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.