|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 06:31 PM
పార్టీకి కార్యకర్తలే బలం...దైర్యమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది తనకు అండగా ఉన్నారని.. కష్టాల్లో తోడుగా నిలిచారన్నారు. ధైర్యం, బలం మీరే అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. 'నా ధైర్యం మీరే.. నా బలం మీరే. నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు' తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రతి అభిమాని కాలర్ ఎగరేసేలా వైఎస్సార్సీపీ ఉంటుందన్నారు వైఎస్ జగన్. వైఎస్సార్ ఆశయ సాధన కోసం 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందన్నారు. వైఎస్సార్సీపీ ఏపీ దశ, దిశను మార్చిందని.. దేశ రాజకీయాల్లో ఎంతో మార్పు కనిపించిందన్నారు. విలువలు, విశ్వసనీయతతో.. ప్రజలు, దేవుడ్ని నమ్ముకున్నానని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ కోట్లాదిమంది ప్రజల మదిలో ఉందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీ పరిణామాలు వేగంగా మారాయి. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత 2011లో వైఎస్సార్సీపీని ఏర్పాటు చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాలేకపోయింది.. 2019లో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 2024లో వైఎస్సార్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది.. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమతమైంది.
Latest News