|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 06:20 PM
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖకు దేశ, విదేశాల నుంచి కంపెనీలను ఆహ్వానిస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, సకల సౌకర్యాలు కల్పిస్తున్న చంద్రబాబు సర్కార్.. కంపెనీలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే క్యాప్ జెమినీ సంస్థ తమ క్యాంపస్ను విశాఖలో ఏర్పాటు చేయనుండగా.. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా ఆ సంస్థ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్తో మంత్రి లోకేష్ భేటీ అయి కీలక విషయాలపై చర్చించారు. విశాఖలో క్యాప్ జెమినీ సంస్థ ఏర్పాటుపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. విశాఖలో ఐటీ హబ్గా ఎదుగుతున్న మధురవాడలోని ఐటీ పార్క్ హిల్-1పై క్యాప్ జెమినీ సంస్థ కోసం ఇప్పటికే 20 ఎకరాల భూమిని పరిశీలించారు.
అదే సమయంలో ఆ సంస్థ ప్రతినిధులు అడివివరం, ఆనందపురం పరిధిలో రెండు చోట్ల కూడా భూముల పరిశీలన చేశారు. అయితే క్యాప్ జెమినీకి పర్మినెంట్ క్యాంపస్ అందుబాటులోకి వచ్చే వరకు.. తాత్కాలికంగా కార్యకలాపాలు సాగించేందుకు సెంట్రల్ పార్కు సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ భవనాన్ని సెలెక్ట్ చేశారు.
అయితే క్యాప్ జెమినీ సంస్థ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కావాలని ఆ సంస్థ ప్రతినిధులు చూస్తున్నారు. ఇక తమ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాలని ఇప్పటికే.. క్యాప్ జెమినీ సంస్థ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. కొత్తగా 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా క్యాప్ జెమినీ కంపెనీ.. ఏపీలో శాశ్వత క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్యాప్ జెమినీ లాంటి సంస్థ విశాఖకు రానుండటంతో ఏపీకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని అక్కడి యువత ఆశిస్తోంది.
Latest News