|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:02 PM
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య సాగుతున్న యుద్దంతో పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతీకారంతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీష్.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, ఉద్రిక్తతలపై చర్చించినట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ప్రాంతంలోని దేశాలతో వివాదంలోకి దిగే ఉద్దేశం తమకు లేదని పాకిస్థాన్ ప్రధానికి అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
యుద్ధానికి బాధ్యులను జవాబుదారీగా ఉంచడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైతే ప్రపంచ క్రమం, భద్రత ప్రమాదంలో పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. ఈ యుద్దానికి దారితీసిన ఇరాన్పై వైమానిక దాడులకు మూల కారణం ఎవరో అంతర్జాతీయ సమాజం నిగ్గుతేల్చాలని పెజిష్కియాన్ డిమాండ్ చేశారు. అంతేకాదు, పొరుగు దేశాలపై దాడులు లేదా సరిహద్దుల్లో ఘర్షణ పడే ఉద్దేశం తమకు లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్కి తేల్చిచెప్పినట్టు రాయిటర్స్ నివేదించింది. ఇదిలా ఉండగా, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణల్లో చిక్కుకున్న సౌదీ అరేబియాకు అవసరమైతే సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ప్రకటన చేయడం గమనార్హం. గతేడాది ఇరు దేశాల మధ్య సైనిక సహకార ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్.. యుద్ధంపై పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి యుద్ధం త్వరలోనే ఆగిపోతుందని, ఇంకోసారి పూర్తిగా యుద్ధంలో విజయం సాధించాల్సి ఉందని భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా, మరోసారి ఆయన యుద్ధం ముగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అన్ని టార్గెట్లను ఛేదించామని, అక్కడ ఇంకేమీ మిగల్లేదని చెప్పారు. ఇరాన్లో భీకర యుద్ధం జరగుతోందని, అమెరికా సేనలు ఊహించిన దానికన్నా ఎక్కువ విధ్వంసం సృష్టించాయని అన్నారు. అంతేకాదు, తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందని అన్నారు. ఆరు వారాల్లో సాధించాల్సింది పది రోజుల్లోనే పూర్తిచేశారని చెప్పడం గమనార్హం.
ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని ట్రంప్ చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దుబాయ్ విమానాశ్రయంపై బుధవారం మరోసారి దాడికి ప్రయత్నించింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్టు స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బందికి సేఫ్టీ నోటీసు జారీచేశారు. హర్మూజ్ జల సంధిలో భారత్కు వస్తున్న థాయ్లాండ్ ఆయిల్ ట్యాంకర్ నౌన మయూరీ నారీ బ్యాంకాక్పై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు నావికులు గల్లంతయ్యారు.
Latest News