|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:51 PM
హైదరాబాద్లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్సైలు పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ ) అధికారులు నగరంలో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు ఎస్సైలు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి లంచం డబ్బులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లంచం అడిగిన వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. పక్కా ప్లాన్ ప్రకారం ఆ ఇద్దరు ఎస్సైలు లంచం సొమ్ము తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఒక సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి నిందితుడికి మేలు చేసేందుకు అతడి నుంచి ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆర్ఎస్సైలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ లంచం డిమాండ్ చేశారు. ఆ సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేయకుండా ఉండటం.. 41ఏ కింద నోటీసులు జారీ చేయకుండా ఉండేందుకు రూ.లక్ష ఇవ్వాలని ప్రమోద్, బాబు నాయక్ డిమాండ్ చేశారు. ఈ లంచం కోసం ఇద్దరు ఎస్సైలు అతడిపై ఒత్తిడి తీసుకురాగా.. వారి వేధింపులను తట్టుకోలేని ఆ నిందితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు.
అతడి నుంచి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు.. రంగంలోకి దిగారు. హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలోని ఏసీబీ టీమ్ పక్కా ప్లాన్తో ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ స్టేషన్పై దాడులు నిర్వహించింది. ఆ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా బాబు నాయక్, ప్రమోద్ కుమార్ గౌడ్ ఎస్సైలు ఇద్దరినీ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి లంచం సొమ్మును సీజ్ చేశారు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
అయితే పోలీస్ శాఖలో ఉంటూ నేరాలను అరికట్టి, చట్టాలను కాపాడే పోలీసులే ఇలాంటి అవినీతికి పాల్పడి, ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఎస్సైలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. రిమాండ్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వీరిద్దరినీ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే.. 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు సూచించారు.