|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:24 PM
మధ్యప్రదేశ్ పోలీసు అకాడమీల్లో శిక్షణ పొందుతున్న యువ పోలీసుల దినచర్యలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటికే భగవద్గీత, రామచరితమానస్ బోధనలతో వార్తల్లో నిలిచిన ఎంపీ పోలీసు ట్రైనింగ్ వింగ్.. ఇప్పుడు ఉదయాన్నే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠనాన్ని తప్పనిసరి చేస్తూ సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం రాష్ట్రంలో మరోసారి రాజకీయ దుమారానికి తెరలేపింది.
ఏమిటా కొత్త ఉత్తర్వు?
అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్) రాజా బాబు సింగ్ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని పోలీస్ ట్రైనింగ్ స్కూల్స్లో ప్రతిరోజూ ఉదయం శిక్షణ ప్రారంభానికి ముందే లౌడ్ స్పీకర్ల ద్వారా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్లే చేయాలి. శిక్షకులు, అభ్యార్థులు అందరూ ఈ శ్లోకాలను వినేలా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పరమ శివుని రూపమైన దక్షిణామూర్తిని విశ్వ గురువుగా పరిగణిస్తారని.. ఆయన జ్ఞానం, ధ్యానం, యోగాకు ప్రతిరూపమని ఏడీజీ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 8 శిక్షణా కేంద్రాల్లో దాదాపు 4 వేల మంది పురుషులు, మహిళలకు శిక్షణ ఇస్తున్నాయని.. వీరంతా నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం వింటారు, చదువుతారని అన్నారు.
అలాగే "జ్ఞానం అంటే కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు. ఒక పోలీసు అధికారికి విచక్షణ, వివేకం, సానుభూతి, సున్నితత్వం చాలా అవసరం" అని రాజా బాబు సింగ్ తన సందేశంలో వివరించారు. ఈ స్తోత్రం వినడం ద్వారా అభ్యర్థుల్లో నైతిక స్పష్టత పెరుగుతుందని, వారు కేవలం వృత్తి నిపుణులుగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన, మానవతా దృక్పథం కలిగిన అధికారులుగా రూపు దిద్దుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ సంస్థల తటస్థతపై కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడే సంస్థలు రాజ్యాంగ విలువల ప్రకారం నడుచుకోవాలని, అందరు పౌరులను సమానంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఏదైనా ఒక నమ్మకాన్ని ప్రభుత్వ శిక్షణలో భాగంగా చేర్చడం సరికాదని ఆయన విమర్శించారు.
బీజేపీ సమర్థన..
అయితే అధికార బీజేపీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. భగవద్గీత లేదా దక్షిణామూర్తి స్తోత్రం అనేవి కేవలం మతపరమైనవి కావని, అవి భారతీయ సంస్కృతి, క్రమశిక్షణ, కర్తవ్య నిర్వహణను బోధించే గొప్ప తాత్విక గ్రంథాలని బీజేపీ ప్రతినిధి పంకజ్ చతుర్వేది వాదించారు. వీటిని మతపరమైనవిగా చూడటం అంటే భారతీయ నాగరికతపై అవగాహన లేకపోవడమేనని ఆయన ఎద్దేవా చేశారు. మరి ఈ నిర్ణయం మీకెలా అనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Latest News