|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:24 PM
భారత రాజకీయ, మీడియా చర్చల్లో ఒక ఆసక్తికరమైన అంశం చక్కర్లు కొడుతోంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో అమెరికా సుంకాల ఒత్తిళ్లను తగ్గించి, రష్యా చమురు నుంచి కొనుగోలు చేయడానికి భారత్కు తాత్కాలిక వెసులుబాటు కల్పించినట్టు అమెరికా వాణిజ్య మంత్రి ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా నుంచి అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నాయి. తమపై దాడులు, సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఎదురుదాడులు చేస్తోన్న ఇరాన్.. చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జల సంధిని మూసివేయడంతో రవాణా స్తంభించింది.
ఇది తప్పుదారి పట్టించేదే కాదు.. భారత ఇంధన దౌత్యం, ఆర్థిక విధానంపై అవగాహన లేమికి నిదర్శనం. వాస్తవాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 2026లో భారత్కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా కొనసాగింది. భారతీయ రిఫైనరీలు రోజుకు దాదాపు 1.7 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. అంటే భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 25-30%. అంటే, భారత్ 28-48 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురు ఆ నెలలో కొనుగోలు చేసింది.
ఈ గణాంకాలు భారత ఇంధన ఎంపికను విదేశాలు నిర్దేశిస్తాయనే ప్రచారాన్ని తిప్పికొడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ నిజంగా అమెరికా అనుమతి కోరితే, దిగుమతులు ఈ స్థాయిలో ఉండవు. భారతదేశ విధానం 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత అనే ఒక సాధారణ సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
భారత్ తన ముడి చమురు అవసరంలో 85% కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం నిరంతరం ధరలు, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ముప్పు, దేశీయ ద్రవ్యోల్బణాన్ని సమతౌల్యం చేయాలి. రాయితీ రేటుతో కొనుగోలు చేసిన ప్రతి బ్యారెల్ రవాణా ఖర్చు, తయారీ, విద్యుత్, చివరికి భారత మధ్యతరగతి గృహ బడ్జెట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే, చమురు దిగుమతి విషయంలో భారత తీసుకునే నిర్ణయాలు విదేశీ ఒత్తిడిపై కాకుండా దేశీయ ఆర్థిక అవసరాలు, శక్తి భద్రతపై ఆధారపడి ఉంటాయి.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారీ ఎత్తున డిస్కౌంట్ ధరపై క్రూడాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంటోంది. భారత రిఫైనరీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రపంచ మార్కెట్ ధరల్లో మార్పులు, దేశీయ వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ఇచ్చింది.
Latest News