|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 06:59 PM
వాహనదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. ప్రస్తుతం భారత్లో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, పరిస్థితి మరింత స్థిరంగా మారుతోందని, అందువల్ల ధరల పెంపు ఉండదని వెల్లడించాయి.ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశాయి. అయితే, ధరలు పెరగవన్న హామీ కేవలం పెట్రోల్, డీజిల్ విషంయంలోనేనని, ఎల్పీజీ విషయంలో కాదని స్పష్టత ఇచ్చారు. గడిచిన 12 ఏళ్లలో ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.110 మేర పెరిగిందని అధికారులు గుర్తుచేశారు. ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ, సరఫరా మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.మరోవైపు, ముడి చమురు దిగుమతుల కోసం సమస్యాత్మక మార్గాలపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకుంది. హోర్ముజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాల ద్వారా చమురు దిగుమతులను పెంచుకున్నట్లు అధికారులు తెలిపారు.గతంలో 60 శాతం ముడి చమురు దిగుమతులు ఇతర మార్గాల ద్వారా వచ్చేవని, ఇప్పుడు ఆ వాటా 70 శాతానికి పెరిగింది అని వివరించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా కూడా మొదటి కార్గో రవాణా ప్రారంభమైందని, సరఫరా వ్యవస్థ గాడిలో పడుతోందని పేర్కొన్నారు. ఇంధన సరఫరా ధరల స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని తెలిపారు.
Latest News