|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 10:18 PM
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ తన కామెంట్స్తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ 2026 సమయంలో పదేపదే భారత్పై నోరు పారేసుకుంటున్న అతడు.. ప్రతీసారి నవ్వుల పాలవుతున్నాడు. ఓ పక్క తమ జట్టు.. సూపర్-8 నుంచే నిష్క్రమించినా.. అతడు మాత్రం దాని గురించి ఆలోచించకుండా.. టీమిండియాను తక్కువ చేసే మాట్లాడటంపై ఫోకస్ చేశాడు. అవకాశం దొరికితే చాలు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటున్నాడు. ఇటీవల టీమిండియా సెమీస్ చేరదని జోస్యం చెప్పిన అతడు.. మ్యాచ్ తర్వాత విమర్శల పాలయ్యాడు.
తాజాగా అమిర్ మరోసారి భారత్ను విమర్శిస్తూ కామెంట్స్ చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్కు ముందు అతడు.. మాట్లాడాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు చేరదని.. ఇది పక్కా అని మరోసారి జోస్యం చెప్పాడు. భారత జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని కామెంట్స్ చేశాడు.
“టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా తప్పా.. మిగతా వారెవరూ ఫామ్లో లేరు. వారంతా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బ్యాటింగ్ విషయంలోనూ భారత బ్యాటర్లు తడబడుతోంది. అందుకే సెమీఫైనల్లో వారు ఇంగ్లాండ్ను ఓడించడం కష్టం. అది సాధ్యం కాదు. నేను భారత్ సెమీస్ చేరదని చెప్పాను. కానీ సంజూ శాంసన్ బాగా ఆడాడు. అందుకే టీమిండియా టాప్-4లో నిలిచింది. కానీ ఇప్పటికీ టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్.. ప్రతీదాంట్లో వైఫల్యాలు ఉన్నాయి. ఇంగ్లాండ్తో సెమీస్ మంచి హోరాహోరీ మ్యాచ్ అవుతుంది. కానీ టీమిండియా ఫైనల్కు అస్సలు చేరదు” అని అమిర్ వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలతో అమిర్ మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే చాలా సార్లు నీ అంచనాలు తప్పాయి. నీ పని నువ్వు చేసుకోక.. నీకెందుకు ఇదంతా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు మార్చి 5న ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Latest News