ఖమేనీ‌ ఫేట్‌ను డిసైడ్ చేసిన ట్రాఫిక్ కెమెరాలు, మొస్సాద్ గూఢచారులు
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:31 PM

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ కొన్నేళ్ల కిందట నుంచి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిందని, ఖమేనీ కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరా, మొబైల్‌ ఫోన్ నెట్‌వర్క్ వ్యవస్థలను హ్యాక్‌ చేసిందని బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నివేదించింది. కొన్నేళ్ల పాటు టెహ్రాన్‌లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు హ్యాకింగ్‌కు గురయినట్టు ఇజ్రాయెల్ నిఘా అధికారులు వెల్లడించారు. ఆ ఫుటేజీలను ఎన్‌క్రిప్ట్‌ చేసి, ఎప్పటికప్పుడు ఖమేనీ కదలికలను తెలుసుకున్నట్టు పేర్కొన్నారు.


 ఖమేనీ కార్యాలయ ప్రాంగణంలో రోజూవారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది చిరునామాలు, డ్యూటీ సమయం, వాళ్లు మార్గాలు, వాహనాల పార్కింగ్ గురించి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ పూర్తి సమాచారం సేకరించినట్టు ఆ కథనం తెలిపింది. ‘‘ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉంటారు..? ఆయన ఎవరిని కలుస్తున్నారు..? వారితో ఎలా కమ్యూనికేట్ అవుతారు..? తన ప్రాణానికి ఏదైనా ముప్పు ఉంటే ఆయన ఉండే సురక్షిత ప్రాంతం ఏంటి.?’’ ఇలా ప్రతి విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్‌లు క్షుణ్నంగా అధ్యయనం చేశాయని వెల్లడించింది. ఆయనతో భేటీ అయ్యే రాజకీయ, సైనిక ఉన్నతాధికారుల్ని కూడా ఇజ్రాయెల్ ట్రాక్ చేసినట్లు సమాచారం.


‘‘జెరూసలెం గురించి మాకు ఎంత తెలుసో.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు’’ అని మొస్సాద్ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఏఐ టూల్స్, అల్గారిథమ్స్ సాయంతో ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చినట్టు సమాచారం. ఇక, శనివారం (ఫిబ్రవరి 28న)న అత్యంత కచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ సమాచారమే ఉపయోగపడింది.


శుక్రవారం ఇరాన్‌లో గవర్నమెంట్ హాలీ డే కావడంతో ఖమేనీ ప్రతి శనివారం తన అధికారిక నివాసంలో ప్రభుత్వ ముఖ్య నేతలు, ఉన్నతస్థాయి సైనిక అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. టెహ్రాన్‌ నడిబొడ్డున ఒక ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇరాన్‌ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశమవుతున్నట్టు తెలుసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందులో సీఐఏ అందించిన సమాచారం కూడా కీలకంగా మారింది.


శనివారం నాటి ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్‌పై సైబర్ దాడులు కూడా జరిగినట్టు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అత్యంత కీలకమైన మౌలిక సౌకర్యాలతో పాటు భద్రతా సమాచార వ్యవస్థ, అధికారిక మీడియా సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని జెరూసలెం పోస్ట్ తెలిపింది. దీనికి కారణంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ పడిపోయిందని ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ప్రతిస్పందన సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే సైబర్‌ దాడి చేసినట్లు తెలుస్తోంది.


పాశ్చర్ స్ట్రీట్ సమీపంలో ఉన్న దాదాపు డజను మొబైల్ ఫోన్ టవర్లలోని ఓ భాగాన్ని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలిగిందని, కాల్ చేసినప్పుడు ఫోన్లు బిజీగా ఉన్నట్లు అనిపించేలా చేసి, ఖమేనీ రక్షణ సిబ్బందికి హెచ్చరికలు అందకుండా నిలివేసిందని నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్ అధునాతన సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200, మొసాద్ నియమించిన గూఢచారులు, సైనిక ఇంటెలిజెన్స్ రోజువారీ బ్రీఫ్‌లలో సేకరించి డేటా ఫలితంగా ఇరాన్ నిఘా చిత్రం సాధ్యమైందని నివేదిక తెలిపింది.


గతేడాది జూలో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశం నిఘా ఆధిపత్యం పూర్తిగా ప్రదర్శితమైంది. ఆ సమయంలో ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, ఉన్నత స్థాయి సైనిక అధికారులను నిమిషాల్లోనే హత్యకు గురయ్యారు. జూన్ యుద్ధం, ఇప్పటి దాడిలో ఇజ్రాయెల్ పైలట్లు స్పారో అనే నిర్దిష్ట రకమైన క్షిపణిని ఉపయోగించారు, 1,000 కి.మీ కంటే ఎక్కువ దూరం నుంచి డైనింగ్ టేబుల్ వంటి చిన్న లక్ష్యాన్ని కూడా ఇవి చేధించగలవు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM