|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:45 PM
శ్రీకాకుళం జిల్లాలో ఓ అవినీతి అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. నరసన్నపేట వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి (ఏబీసీడబ్ల్యూవో) గడ్డి బాల ముకుందరావు నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. నరసన్నపేటతో పాటు సోంపేట విభాగానికి కూడా బాల ముకుందరావు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. వసతిగృహాల మెస్ బిల్లులు మంజూరు చేయడానికి, ప్రతి విద్యార్థికి రూ.15 చొప్పున వార్డెన్ల నుంచి ఆయన లంచం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 28న అధికారులు ఆయన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, లెక్కల్లో చూపని రూ.1,84,070 నగదు పట్టుబడింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న శ్రీకాకుళం పట్టణంలోని బాల ముకుందరావుకు చెందిన రెండు ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్రిజస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 4 స్థిరాస్తుల పత్రాలు, 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి వస్తువులు, కొంత నగదు, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Latest News