|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:02 PM
పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు భారీ భూదోపిడీకి పాల్పడుతూ బినామీలకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను ధారాదత్తం చేస్తున్నాడని విశాఖ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ధ్వజమెత్తారు. విశాఖ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇన్నాళ్లూ ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా రూ. 1500 కోట్లు విలువ చేసే 30 ఎకరాల భూమిని 99 పైసలకే ఏఎస్ఐపీ అనే కంపెనీకి కట్టబెట్టాడని చెప్పారు. రూ.30 కోట్లు కేపిటల్ లేని ఆ కంపెనీ రూ. 2,387 కోట్లు పెట్టుబడులు పెడుతుందని, వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నాడని వివరించారు. తాను 99 పైసలకే భూములిచ్చిన సత్వా, ఉర్సా, కపిల్, రహేజా వంటి కంపెనీలు ఇప్పటివరకు పనులే ప్రారంభించలేదని గుర్తుచేశారు. చంద్రబాబుకి నిజంగా విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే భూములకు బహిరంగ వేలం నిర్వహిస్తే నిజమైన కంపెనీలే వస్తాయని, అవి త్వరగా కంపెనీలు ప్రారంభించి స్థానిక యువతకు ఉద్యోగాలిస్తాయని వివరించారు. కానీ చంద్రబాబు మాత్రం పప్పుబెల్లాలకు భూములిస్తే ప్రజలకు ఏ మాత్రం మేలు జరగదని స్పష్టం చేశారు. చంద్రబాబు అడ్డగోలు భూదోపిడీకి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ప్రజలతో కలిసి పోరాతుందని కెకె రాజు హెచ్చరించారు.
Latest News