|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:21 PM
మహారాష్ట్ర రాజకీయ ఉద్ధండుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక విమానయాన సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ ఘోరమైన నిర్లక్ష్యం ఉందంటూ అజిత్ పవార్ కుమారుడు జై పవార్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి బలాన్ని చేకూర్చుతూ.. ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అందులో విమానయాన సంస్థ యజమాని.. విమానం గాల్లో ఉండగానే కాక్పిట్లోకి వెళ్లిన ఆయన నిద్ర పోతున్నది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. సదరు సంస్థ నిర్లక్ష్యమే అజిత్ పవార్ మృతికి కారణం అయ్యుండొచ్చని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాక్పిట్లో నిద్ర.. గాలిలో ప్రాణాలతో చెలగాటం!
జై పవార్ షేర్ చేసిన వీడియోలో.. విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో కాక్పిట్లోని ఎడమ వైపున ఉండే మెయిన్ పైలట్ సీటులో ఒక వ్యక్తి సివిల్ దుస్తులు ధరించి హాయిగా నిద్రపోతూ కనిపిస్తున్నారు. పక్కనే యూనిఫాంలో ఉన్న పైలట్ విమానాన్ని నడుపుతుండగా.. ఈ వ్యక్తి మాత్రం బ్యాగును పట్టుకుని గాఢ నిద్రలో ఉన్నారు. ఈ వీడియోపై జై పవార్ మండిపడుతూ.. "ఈ నిద్రిస్తున్న వ్యక్తి మరెవరో కాదు. వీఎస్ఆర్ వెంచర్స్ అధినేత రోహిత్ సింగ్. నిబంధనల ప్రకారం కాక్పిట్లోకి అనధికారిక వ్యక్తులకు అనుమతి ఉండదు. కానీ యజమాని హోదాలో అతను మెయిన్ పైలట్ సీటులో నిద్రపోవడం భద్రతా ప్రోటోకాల్స్ను తుంగలో తొక్కడమే. మా నాన్నను నేను కోల్పోయాను.. ఈ బాధ నా జీవితాంతం ఉంటుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రోహిత్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేయాలి" అని డిమాండ్ చేశారు.
ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్య నేతలు రోహిత్ సింగ్ వివాహానికి హాజరయ్యారని, అందుకే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెనకాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసును ప్రస్తుతం పూణే సీఐడీ విచారిస్తోంది.
ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. జనవరి 28వ తేదీన బారామతిలో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విజిబిలిటీ కేవలం 3 కిలో మీటర్లు మాత్రమే ఉంది. విజువల్ ఫ్లైట్ రూల్స్ (వీఎఫ్ఆర్) ప్రకారం కనీసం 5 కిలో మీటర్ల విజిబిలిటీ ఉండాలి. తక్కువ వెలుతురు, భద్రతా లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, ఒక క్యాబిన్ అటెండెంట్, పవార్ భద్రతా అధికారి కూడా మరణించారు.