|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 06:20 PM
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నవారు, అత్యవసర పరిస్థితులలో ఉన్న వ్యక్తులు తమ వివరాలను ఏపీ ఎన్ఆర్టీఎస్ హెల్ప్లైన్ నంబర్ అయిన 0863-2340678 ఫోన్ నంబర్ సంప్రదించాలని ఏపీ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. అలాగే వాట్సాప్ నంబర్ +91 85000 27678 ఉపయోగించుకోవాలని సూచించారు. helpline@apnrts.com ఈమెయిల్ ద్వారా సంప్రదించి సహాయం పొందవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
మరోవైపు గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్టులలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామన్నారు. గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు ప్రజలు స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు.
బహ్రెయిన్లో చిక్కుకున్న వారిపై స్పీకర్ ఆరా..
మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్లో ఉన్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. ఏపీకి చెందిన సుమారు 50 వేల మంది బహ్రెయిన్లో ఉంటున్నారు. వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంతం నుంచి ఎక్కువ మంది అక్కడికి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఎన్నారై శెట్టి సతీశ్కు అయ్యన్నపాత్రుడు ఫోన్ చేశారు. తెలుగువారి యోగక్షేమాలను ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో సహాయం కోసం ఏపీఎన్ఆర్టీ ద్వారా ఏపీ ప్రభుత్వం సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు భరోసా ఇచ్చారు.
Latest News