|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 10:47 PM
ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 సూపర్ 8 పోరులో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది. పోటాపోటీగా సాగుతుందనుకున్న మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమిపాలయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 187 పరుగులు చేస్తే.. 111 పరుగులకే ఆలౌటైన భారత్.. 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దాంతో ఇప్పుడు భారత్ సెమీస్ చేరుకోవడానికి సౌతాఫ్రికా మీదే ఆధారపడాల్సి రానుంది.
ఈ మ్యాచ్లో భారత్ ఆలౌట్ కాకుండా ఉన్నా, లేకపోతే తక్కువ మార్జిన్తో ఓడిపోయినా ఇంత టెన్షన్ ఉండేది కాదు. 76 పరుగుల తేడాతో ఓడిపోవడం, ఆలౌట్ కావడం, 20 ఓవర్లు ఆడకపోవడంతో భారత్ నెట్ రన్రేట్ దారుణంగా పడిపోయింది. సూపర్ 8లో భారత్ రన్రేట్ను ఒకసారి పరిశీలిస్తే - 3.80కి పడిపోయింది.
సౌతాఫ్రికా భారీ విజయం సాధించడంతో రెండు పాయింట్లతో 3.8 నెట్రన్రేట్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సౌతాఫ్రికా సెమీస్కి దాదాపు లైన్ క్లియర్ అయిందనే చెప్పొచ్చు. జింబాబ్వే, వెస్టిండీస్లతో ఒక్క మ్యాచ్ గెలిచినా సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. అయితే భారత్ కూడా సెమీఫైనల్కి వెళ్లాలంటే సౌతాఫ్రికా కచ్చితంగా జింబాబ్వే, వెస్టిండీస్పై గెలవాలి. అప్పుడు సౌతాఫ్రికా 6 పాయింట్లు సాధించగలదు. అదే సమయంలో భారత్ మిగతా రెండు మ్యాచ్లలో గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికాతోపాటు ఇండియా కూడా సెమీస్లో అడుగుపెడుతుంది. సూర్య సేనసౌతాఫ్రికాతో మ్యాచ్లో ఓటమికి గల కారణాలను సరిగా విశ్లేషించుకోవాలి.
అయితే ఇది అంత తేలికైన వ్యవహారమేం కాదు. గ్రూప్ 1లో భారత్, సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్ కూడా చాలా బలంగా ఉంది. వెస్టిండీస్ గ్రూప్ స్టేజ్లో కూడా నాలుగు విజయాలు సాధించి స్ట్రాంగ్ టీమ్గా ఉంది. దాంతో భారత్ సెమీ ఫైనల్కు చేరుకోవాలంటే వెస్టిండీస్పై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే కూడా ఝలక్ ఇచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు మ్యాచ్ల్లో జట్టు సమష్టిగా రాణిస్తేనే గెలిచే అవకాశం ఉంది. లేకపోతే టీమిండియా సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది.
భారత్ సూపర్8లో జింబాబ్వే, వెస్టిండీస్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 26న జింబాబ్వే, మార్చి 1న వెస్టిండీస్తో మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లలో భారత్ గెలిచినా.. ఏదో ఒక మ్యాచ్లో మాత్రం భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. మొత్తానికి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ ఆశలతో ప్రయాణం మొదలుపెట్టిన భారత్.. సూపర్ 8లో పెద్ద గండాన్నే దాటాల్సి ఉంది.
Latest News