|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 07:28 PM
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ధృవతార, తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆయన కుమారుడు సుబ్రాన్షు రాయ్ ధృవీకరించారు. ఆయన మృతితో బెంగాల్ ప్రజలంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు.
మమత బెనర్జీకి కుడిభుజంగా..
71 ఏళ్ల వయసు కల్గిన ముకుల్ రాయ్ ఓ రాజకీయ నాయకుడిగానే కాకుండా సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో ఒక శక్తిమంతమైన వ్యూహకర్తగా కూడా నిలిచారు. ముఖ్యంగా టీఎంసీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. పార్టీలో మమత తర్వాత రెండో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. బెంగాల్లో టీఎంసీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అనన్యసాన్యం.
భాజపాలో కీలక పాత్ర.. మళ్లీ సొంత గూటికి..
ముకుల్ రాయ్ రాజకీయ ప్రస్థానంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. 2017లో టీఎంసీని వీడి భాజపాలో చేరడం బెంగాల్ రాజకీయాలను ఒక ఊపు ఊపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో భాజపా 18 స్థానాలను గెలుచుకోవడంలో రాయ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆ తర్వాత తిరిగి తన పాత గూడైన తృణమూల్ కాంగ్రెస్లోకి చేరారు.
అనారోగ్యంతో పోరాటం..
గత రెండేళ్లుగా ముకుల్ రాయ్ తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా 2023 నుంచి ఆయన డిమెన్షియా (జ్ఞాపకశక్తి కోల్పోవడం) బారిన పడ్డారు. దీనివల్ల ఆయన క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది. అనారోగ్యం కారణంగానే గతేడాది కలకత్తా హైకోర్టు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.
ప్రముఖుల సంతాపం..
ముకుల్ రాయ్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ముకుల్ ఒక గొప్ప సహచరుడు. ఆయన మరణం మా పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు" అని పేర్కొన్నారు. అలాగే బీజేపీ నేతలు, ఇతర పార్టీల ప్రముఖులు కూడా ఆయనకు నివాళి అర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు సైతం ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Latest News