|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 07:25 PM
పర్యాటక కేంద్రమైన తమిళనాడులోని కొడైకెనాల్లో ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి విష్ణుప్రియ తండ్రి అయిన సూర్యనారాయణ (73) తన సొంత బంగళాలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఇది సాధారణ హత్య కాదని.. పక్కా ప్లాన్తో జరిగిన ప్రతీకార దాడి అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కుర్చీకి కట్టేసి.. నోటికి టేపులు వేసి..
పోలీసుల కథనం ప్రకారం.. కొడైకెనాల్లోని కురింజి ఆండవర్ టెంపుల్ రోడ్డులో సూర్యనారాయణకు ఒక విలాసవంతమైన బంగళా ఉంది. ఆదివారం తెల్లవారుజామున పలువురు దుండగులు.. దొంగతనంగా ఇంట్లోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులను, యజమాని సూర్యనారాయణను బలవంతంగా మూడు కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశారు. అనంతరం సూర్యనారాయణ అరవకుండా ఉండేందుకు హెవీ డ్యూటీ ప్యాకింగ్ టేపులతో ముఖం, నోటిని గట్టిగా చుట్టేశారు. ఈక్రమంలోనే ఆయన ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సూర్యనారాయణ వద్ద పనిచేసే అసిస్టెంట్ ఒకరు ఎలాగోలా తాళ్లను విప్పుకుని.. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
సినిమాను మించిన మలుపులు..
సూర్యనారాయణ కుమార్తె విష్ణుప్రియ 2018లో ఒక తమిళ సినిమాలో దివ్యాంగురాలి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. పోలీసుల విచారణలో ఈ హత్య వెనుక ఒక పాత నేర చరిత్ర ఉన్నట్లు బయటపడింది. ముఖ్యంగా విష్ణుప్రియకు తన భర్త రమేష్ కృష్ణతో విభేదాలు రావడంతో ప్రభాకరన్ అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె వ్యవహారం తెలుసుకున్న సూర్యనారాయణ.. గతంలో ప్రభాకరన్ను హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకరన్ హత్యకు ప్రతీకారంగానే అతడి అనుచరులు లేదా బంధువులు కలిసి ఇప్పుడు సూర్యనారాయణను మట్టుబెట్టినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
రంగంలోకి ఫోరెన్సిక్ బృందాలు
ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగులు సూర్యనారాయణ కదలికలను ముందు నుంచే గమనించి.. పక్కాగా రెక్కీ చేసినట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలిపారు. "మేము ఇప్పటికే అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నాం. నిందితులను పట్టుకుంటేనే ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తెలుస్తుంది" అని వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త కొడైకెనాల్లో దారుణ హత్యకు గురవడం తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది.
Latest News